మనిషికి పేరు ఒక ఐడెంటిటీ. కానీ, ఆ పేరు ఇబ్బందులు తెచ్చిపెడితే ఎలా ఉంటుంది?. కేరళలో ఒకావిడకు ఆమె పేరుతో చాలా అవమానాల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ, ఆమె మాత్రం నవ్వుతూ వాటన్నింటిని భరించింది. అలా భరించినందుకే సోషల్ మీడియా ద్వారా ఇప్పుడామె ఒక సెలబ్రిటీ అయ్యింది. ఇంతకీ ఆమె పేరేంటంటే.. కోరోనా.
ఆలెప్పీకి చెందిన ఈమెకి పుట్టగానే తల్లిదండ్రులు ‘కరోనా’ అని పేరు పెట్టారు. దానర్థం కిరీటం అని. కానీ, ఆ చర్చి ఫాదర్ పొరపాటున ‘సీ’ లెటర్ బదులుగా ‘కె’ అని రాశాడట. దాంతో ఆమె పేరు ‘కోరోనా’ అయ్యింది. వోటర్ ఐడీ, సర్టిఫికెట్స్.. ప్రతీదాంట్లోనూ కోరోనా అనే ఉండిపోయింది. పెళ్లయ్యాక ఆమె భర్త, ఇద్దరు పిల్లలతో కొట్టాయంలో సెటిల్ అయ్యింది. లాక్డౌన్ టైంలో ఆమె ఓ వ్యక్తికి బ్లడ్ డొనేట్ చేసిదంట. ఆ టైంలో ఆమె కొరోనా అని పేరు చెప్పగానే అందరూ గొల్లున నవ్వారట. స్కూల్ టీచర్లు కూడా పిల్లల ద్వారా ఆమె పేరు తెలుసుకుని.. నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకునేందుకు బడికి పిలిపించుకున్నారట. అంతేకాదు వీధుల వెంట వెళ్తుంటే.. ‘‘గో కరోనా గో” అని కామెంట్స్ చేసేవాళ్లట చాలామంది. ఇలా ఈ కరోనా కాలంలో చాలాసార్లు ఆమె పేరు ఆమెని ఇబ్బంది పెట్టింది. కానీ, ఆమె మాత్రం వాటన్నింటిని లైట్ తీస్కుంది. కానీ, విచిత్రంగా ఆమె పేరు సోషల్ మీడియా గ్రూపులతో బాగా పాపులర్ అయ్యింది. ఆమె భర్త ఒక జాలరి. ఆమె కుటుంబం పరిస్థితి తెలిసిన లోకల్ ఎన్జీవో ఒకటి ఆమెను కరోనా వారియర్ గ్రూపు మెంబర్గా నియమించింది. చుంగోమ్ ప్రాంతంలో ఆమె ఇప్పుడు కరోనా ఏజెంట్గా పని చేస్తోంది. రోడ్డు మీద వెళ్లే ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని, షాపింగ్ కాంప్లెక్స్ల దగ్గర ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని జనాలకు పాఠాలు చెబుతోంది ఈ కోరోనా. ‘పేరును ఇబ్బందిగా ఫీల్ కావట్లేదా?’ అని అడిగితే.. ‘ అమ్మానాన్నలు పెట్టిన పేరు. అయినా జనాలు జాగ్రత్తగా ఉండాల్సింది కరోనా వైరస్ నుంచే తప్ప.. తనలాంటి పేద మహిళ నుంచి కాదని’ అంటోంది ఈ వైరల్ సెలబ్రిటీ.