ఆర్టీఐకి దరఖాస్తు చేస్తే.. 40 వేల పేజీల ఆన్సర్​ వచ్చింది..

ఆర్టీఐకి దరఖాస్తు చేస్తే.. 40 వేల పేజీల ఆన్సర్​ వచ్చింది..

ఆర్టీఐ కింద దరఖాస్తు చేసిన ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. మధ్యప్రదేశ్​లోని ఇండోర్​కి చెందిన ధర్మేంద్ర శుక్లా కొవిడ్​19 టైంలో మెడిసన్స్, పరికరాలు, మెటీరియల్​సరఫరాలకు సంబంధించిన టెండర్లు, వాటి బిల్లుల చెల్లింపు వివరాల్ని కోరుతూ చీఫ్​ మెడికల్​ అండ్​ హెల్త్​ ఆఫీసర్​కు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశాడు. 

నెల రోజులైనా అధికారులు సమాధానం ఇవ్వకపోవడంతో శుక్లా అప్పిలేట్​ ఆఫీసర్​ శరద్​గుప్తాను ఆశ్రయించారు. ఆయన అడిగిన సమాచారాన్ని ఇవ్వాలని గుప్తా అధికారులను ఆదేశించారు. ఏకంగా 40 వేల పేజీల సమాచారాన్ని దరఖాస్తుదారుడికి ఇచ్చారు. వాటిని తీసుకెళ్లడానికి శుక్లా ఓ కారును ఉపయోగించాల్సి వచ్చింది. 

ప్రభుత్వ ఖజానాపై భారం..

సాధారణంగా ఆర్టీఐ కింద ఇచ్చే సమాధానం నెల రోజుల లోపు ఉంటే ప్రతి పేజీకి దరఖాస్తుదారుడే  రూ.2 చొప్పున చెల్లించాలి. నెలలోపు ఇవ్వకపోతే ఆ ఖర్చు మొత్తాన్ని సంబంధిత విభాగమే భరించాలి. దీంతో శుక్లాకు ఆ సమాచారం ఇవ్వడానికి ఖజానాపై పేపర్​ ప్రింటింగ్​ రూపంలో రూ.80 వేల భారం పడటంతో అధికారులు తలలు పట్టుకున్నారు. దీంతో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులు ఆదేశించడం కొసమెరుపు.