హైదరాబాద్ లో యువతి, ఆమె తల్లిపై కత్తితో దాడి

హైదరాబాద్ లో యువతి, ఆమె తల్లిపై కత్తితో దాడి

యువతి, ఆమె తల్లిపై కత్తితో దాడి
ఆపై గొంతు కోసుకున్న యువకుడు
యువతి తనను దూరం పెడుతోందని దారుణం 
ముగ్గురినీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. హైదరాబాద్​లోని మియాపూర్​లో ఘటన 
వీళ్లందరిదీ ఏపీలోని గుంటూరు జిల్లా

మాదాపూర్, వెలుగు : ప్రేమించిన యువతి తనను దూరం పెడుతోందని కోపం పెంచుకున్న యువకుడు.. ఆ యువతి, ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఆపై తానూ గొంతు కోసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. గుంటూరు జిల్లా రేపల్లె దగ్గర్లోని ఇసుకపల్లికి చెందిన వెంకటరాజు, శోభ దంపతులకు కొడుకు గోవర్ధన్, బిడ్డ వైభవి (19) ఉన్నారు. వెంకటరాజు ముంబైలో ఉద్యోగం చేస్తుండగా, పిల్లలతో కలిసి శోభ ఊర్లో ఉంటోంది. ఇదే గ్రామానికి చెందిన సందీప్​(25) కూలీ పనులకు వెళ్తుంటాడు. మూడేండ్ల కింద సందీప్, వైభవి ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ విషయం వైభవి ఇంట్లో తెలియడంతో తల్లిదండ్రులు ఆమెను మందలించారు. దీంతో రెండేండ్ల నుంచి సందీప్ ను వైభవి దూరం పెడుతోంది. అతని ఫోన్​ నెంబర్ బ్లాక్ ​చేసింది. అయితే సందీప్ వేరే నంబర్ల నుంచి కాల్ చేస్తూ.. వైభవిని వేధించేవాడు. తనతో మాట్లాడాలని లేదంటే చంపేస్తానని, తానూ సూసైడ్ చేసుకుంటానని బెదిరించేవాడు. అతని వేధింపులు ఎక్కువ కావడంతో వైభవి కుటుంబం హైదరాబాద్ కు వచ్చింది. 

హైదరాబాద్​కు వచ్చి దాడి.. 

మేలో హైదరాబాద్ కు వచ్చిన వైభవి కుటుంబం.. న్యూ హఫీజ్​పేట్​లోని ఆదిత్యనగర్​లో ఉంటోంది. తల్లి కొండాపూర్ లోని ఓ దుకాణంలో, అన్న ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుండగా.. వైభవి ఇంట్లో ఉంటోంది. వైభవికి వరుసకు మామ అయ్యే వ్యక్తితో పెండ్లి చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. వచ్చే ఆదివారం ఎంగేజ్​మెంట్​చేయాలని నిశ్చయించారు. ఈ విషయం తెలుసుకున్న సందీప్.. తనను కాదని వేరే వ్యక్తిని పెండ్లి చేసుకుంటోందన్న కోపంతో  సొంతూరు నుంచి హైదరాబాద్​కు వచ్చాడు. వైభవి ఇంటి అడ్రస్ తెలుసుకొని మంగళవారం ఉదయం10 గంటలకు అక్కడికి చేరుకున్నాడు. ఇంట్లో ఉన్న వైభవి, ఆమె తల్లి శోభతో గొడవపడ్డాడు.

తన వెంట తెచ్చుకున్న కత్తితో ఇద్దరిపై దాడి చేశాడు. ఆ తర్వాత తానూ గొంతు కోసుకున్నాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి వచ్చిన మియాపూర్ పోలీసులు.. ముగ్గురిని కొండాపూర్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన ట్రీట్ మెంట్ కోసం తల్లీబిడ్డను గాంధీకి, సందీప్​ను కోఠి ఈఎన్​టీకి తరలించారు. వైభవికి మెడ కింద, ఆమె తల్లికి ఛాతిపై గాయాలయ్యాయి. ప్రస్తుతం వైభవి, సందీప్​ కోలుకుంటున్నారని.. వైభవి తల్లికి తీవ్ర గాయాలు కావడంతో ఆపరేషన్ చేశారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని మియాపూర్ ఇన్​స్పెక్టర్​ తిరుపతిరావు చెప్పారు.