రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం పంజాబ్లోని హోషియాపూర్ లో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అయితే రాహుల్ యాత్రలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. పార్టీ శ్రేణులతో కలిసి నడుస్తున్న క్రమంలో ఓ వ్యక్తి అనూహ్యంగా రాహుల్ గాంధీ దగ్గరకు వచ్చాడు. సెక్యూరిటీని తప్పించుకుని రాహుల్ను కౌగిలించుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ శ్రేణులు సదరు వ్యక్తిని పక్కకు తీసుకెళ్లారు. అనూహ్య ఘటనతో రాహుల్ గాంధీ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. కాసేపటికి తేరుకుని యాత్ర కొనసాగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
శనివారం జలంధర్లో రాహుల్ గాంధీ జోడో యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరీ గుండెపోటుతో మరణించారు. దీంతో యాత్రను 24 గంటల పాటు నిలిపివేశారు. ఈ క్రమంలో యాత్ర తిరిగి సోమవారం జలంధర్ జిల్లా అదంపుర్ నుంచి ప్రారంభమైంది.
గతేడాది సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర..ఈ నెల 31న కశ్మీర్ లో ముగుస్తుంది. ముగింపు సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఇప్పటికే పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు భారీ బహిరంగ సభను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే దేశంలోనే 24 పార్టీలకు కాంగ్రెస్ ఆహ్వానం కూడా పంపింది.