- పిల్లలు, యువతకు డిజిటల్ అడిక్షన్
- దేశంలో కొత్త ఆరోగ్య సంక్షోభం
- 2025–26 ఆర్థిక సర్వే నివేదికలో హెచ్చరిక
- తగ్గుతున్న ఏకాగ్రత,
- వర్క్ పెర్ఫార్మెన్స్
- బలహీనపడుతున్న సామాజిక సంబంధాలు
- పెరుగుతున్న ఒబెసిటీ, డయాబెటిక్, మానసిక ఆరోగ్య సమస్యలు
- ఆత్మహత్యలకు దారితీస్తున్నట్లు వెల్లడించిన
- ఎకనామిక్ సర్వే
న్యూఢిల్లీ: దేశంలోని యువకులు, పిల్లలు డిజిటల్ అడిక్షన్ కారణంగా తీవ్రమైన ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్నారని 2025–26 ఆర్థిక సర్వేలో వెల్లడైంది. ఎక్కువ స్క్రీన్ చూడటంతో ఏకాగ్రత తగ్గడం, నిద్రలేమి, ఆందోళన పెరిగిపోతున్నదని హెచ్చరించింది. ఒబెసిటీ, డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని పేర్కొన్నది. చదువు, వర్క్ పెర్ఫార్మెన్స్లో వెనుకబడిపోతున్నారని తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా నివేదికలోని అంశాలను ఆమె వివరించారు. అంటువ్యాధుల భారాన్ని తగ్గించడంలో, ఆరోగ్య సంరక్షణ మెరుగుపరచడంలో ఇండియా గణనీయమైన పురోగతిని సాధించినప్పటికీ.. జీవనశైలి, ఆహారం, పట్టణీకరణ, మారుతున్న సామాజిక పరిస్థితుల కారణంగా నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్లు ఎక్కువయ్యాయి. ప్రధానంగా స్మార్ట్ఫోన్లు, గేమింగ్, సోషల్ మీడియా వాడకం పెరిగింది.
యువత, పిల్లల్లో డిజిటల్ వ్యసనం.. ఒక కొత్త ఆరోగ్య సంక్షోభంగా మారుతున్నది. సోషల్, కమ్యూనిటీ సంబంధాలు బలహీనపడుతున్నాయి. డిజిటల్ అడిక్షన్.. డైరెక్ట్గా యువత మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నది. 15 నుంచి 24 ఏండ్ల మధ్య వయస్సు గల వారిలో సోషల్ మీడియా వ్యసనం ఎక్కువ కనిపిస్తున్నది. దీంతో డిప్రెషన్, ఆత్మహత్యలు పెరుగుతున్నాయని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది.
ఒబెసిటీ డేంజర్ బెల్స్
దేశంలో ఒబెసిటీ ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నదని ఆర్థిక సర్వే హెచ్చరించింది. ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ప్యాకేజ్డ్ ఫుడ్స్ వాడకం విపరీతంగా పెరగడమే దీనికి కారణం. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) ప్రకారం.. 24% మహిళలు, 23% పురుషులు అధిక బరువు లేదా ఒబెసిటీతో బాధపడుతున్నారు. ఐదేండ్లలోపు పిల్లల్లో అధిక బరువు సమస్య 2015 –16లో 2.1% ఉండగా, 2019 – 21 నాటికి అది 3.4%కి పెరిగింది. 2035 నాటికి దేశంలో 8.3 కోట్ల మంది పిల్లలు ఒబెసిటీ బారినపడే అవకాశం ఉందని ఆర్థిక సర్వే అంచనా వేసింది.
ఆరోగ్య సమస్యలు కేవలం వ్యక్తిగతమైనవి మాత్రమే కావని.. ఇవి దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని హెచ్చరించింది. అనారోగ్యం వల్ల పని గంటలు తగ్గడం, వైద్య ఖర్చులు పెరగడంతో దేశ జీడీపీపై భారం పడుతుంది. ఊబకాయం వల్ల వచ్చే డయాబెటిస్, గుండె జబ్బులు, హైపర్ టెన్షన్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఆర్థికంగా పెద్ద సవాలుగా మారుతున్నాయి.
జంక్ ఫుడ్ ప్రకటనలపై నిషేధం విధించాలి
అధిక కొవ్వు, చక్కెర కలిగిన హై ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగంపై ఆందోళనలు వ్యక్తమవుతోన్న వేళ కేంద్ర ఆర్థిక సర్వే కీలక సూచన చేసింది. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 11 గంటల వరకు జంక్ ఫుడ్ ప్రకటనలపై నిషేధం విధించే అవకాశాలను పరిశీలించాలని పేర్కొంది. అలాగే, చిన్నారులు, పసిపిల్లల పాల ఉత్పత్తులు, పానీయాల మార్కెటింగ్పైనా ఆంక్షలు విధించాలని సూచించింది.
బర్గర్, నూడుల్స్, పిజ్జా, సాఫ్ట్ డ్రింక్ వంటి పదార్థాల కారణంగా దీర్ఘకాల వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందన్న విషయాన్ని ఆర్థిక సర్వే గుర్తు చేసింది. ఇండియాలో 2009 నుంచి 2023 మధ్య జంక్ ఫుడ్ వినియోగం 150శాతానికి పైగా పెరిగింది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ రిటైల్ విక్రయాలు విలువ 2006లో సుమారు వంద కోట్ల రూపాయలు ఉంటే.. 2019 నాటికి అది 40 రెట్లు పెరిగి రూ.3,800 కోట్లకు పెరిగింది.
గిగ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత ముఖ్యం
దేశంలోని 40% మంది గిగ్ వర్కర్ల ఆదాయం నెలకు రూ.15,000 లోపే ఉందని కేంద్ర ఆర్థిక సర్వే తెలిపింది. గిగ్ వర్కర్ల ఆర్థిక భద్రతను మెరుగుపరచడానికి, వారికి ఒక కనీస వేతన పరిమితిని అమలు చేయాలని సర్వే సూచించింది. గిగ్ ప్లాట్ఫామ్లు (యాప్స్) ఉపయోగించే అల్గారిథమ్లు పారదర్శకంగా ఉండాలని సర్వే కోరింది. గిగ్ వర్కర్లకు కేవలం ఆదాయమే కాకుండా, ఆరోగ్య బీమా, ఇతర సామాజిక భద్రతా ప్రయోజనాలు కల్పించడాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని ఈ నివేదిక స్పష్టం చేసింది.
డిజిటల్ అడిక్షన్కు చెక్ పెట్టేందుకు సూచనలు
- ఎక్కువ స్క్రీనింగ్తో శారీరక శ్రమ తగ్గి.. ఊబకాయం వంటి వ్యాధుల బారినపడుతున్నారని సర్వే సూచించింది. ఇది తగ్గించడానికి పలు సూచనలు చేసింది.
- స్కూల్స్లో సైబర్ -సేఫ్టీ విద్యను అందించడంతో పాటు స్క్రీన్- టైమ్ మేనేజ్మెంట్పై తల్లిదండ్రులకు శిక్షణ ఇవ్వాలి.
- ‘డిజిటల్ డైట్స్’ పాటించడం, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆఫ్-లైన్ యూత్ హబ్లను ఏర్పాటు చేయాలి.
- పిల్లలు, యువత సోషల్ మీడియాకు అడిక్ట్ కాకుండా కఠినమైన నిబంధనలు అవసరమని సర్వే నొక్కి చెప్పింది.
- ఇతర అభివృద్ధి చెందిన దేశాల తరహాలో, ఇండియాలోనూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగించడానికి కనీస వయస్సును నిర్ణయించాలి. దాన్ని కచ్చితంగా అమలు చేయాలి.
- విద్యార్థులను ఆటలు, పుస్తకాలు చదవడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి.
- స్కూల్స్లో స్టూడెంట్లకు ‘డిజిటల్ వెల్నెస్’ గురించి బోధించాలి. స్క్రీన్ టైమ్, సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించాలి.
- కరోనా టైమ్లో పెరిగిన ఆన్లైన్ తరగతులపై ఆధారపడటాన్ని తగ్గించి, మళ్లీ ఆఫ్లైన్, క్లాస్రూమ్ బోధనకు ప్రాధాన్యత ఇవ్వాలి.
- చదువుకు మాత్రమే ఉపయోగపడే పరిమిత ఫీచర్లు ఉన్న ట్యాబ్లెట్లు లేదా ఫోన్లను
- ప్రోత్సహించాలి.
