రాజేంద్రనగర్ లో రెచ్చిపోయిన దొంగల ముఠా

రాజేంద్రనగర్ లో రెచ్చిపోయిన దొంగల ముఠా

రంగారెడ్డి జిల్లా :  రాజేంద్రనగర్ లో దొంగల ముఠా రెచ్చిపోయింది. ఉప్పర్ పల్లి ప్రకాష్ నగర్ కాలనీలో అనంత కుమార్ అనే వ్యాపారవేత్త ఇంట్లో రాత్రి చోరీ జరిగింది.  అనంతకుమార్ ఇంట్లోకి వెళ్లిన దొంగలు బీరువాలోని 40 తులాల గోల్డ్, వెండి ఆభరణాలతో పాటు నగదును కూడా ఎత్తుకెళ్లారు. కుటుంబ సభ్యులందరూ ఇంట్లో నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగింది. దొంగతనం చేసే సమయంలో ఇంట్లో శబ్ధాలు రావడంతో యజమాని అనంతకుమార్ నిద్ర లేవడంతో ఆయన్ను చూసి, దొంగలు పారిపోయారు. 

వెంటనే అనంతకుమార్ 100 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. వెంటనే రాజేంద్రనగర్ క్రైమ్ టీమ్, క్లూస్ టీమ్ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేశారు. సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయిన విజువల్స్ ఆధారంగా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటన రాత్రి సుమారు ఒంటిగంట సమయంలో జరిగిందని, కేవలం 15 నిమిషాల్లోనే బంగారం, వెండి నగలను ఇద్దరు దొంగలు ఎత్తుకెళ్లారని బాధితుడు అనంతకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఈ వారంలో రాజేంద్రనగర్ పరిధిలో రెండు చోట్ల దొంగతనాలు జరిగాయి. మానసాహిల్స్ లో గత 5 రోజుల క్రితం విజయనిర్మల అనే మహిళ ఇంట్లో చోరీ జరిగింది. రూ.80 లక్షల విలువ చేసే డైమండ్ తీసుకుని పారిపోయారు. ఇంట్లో పని చేసే నేపాలీలు మూడు గ్రాముల గోల్డ్ తో పాటు ఖరీదైన డైమండ్ రింగ్ ను తీసుకుని పారిపోయారు. ఈ కేసులో నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.