ఓ వృద్ద మహిళను నిలువుదోపిడి చేశాడో ఆటోడ్రైవర్. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. MGBS బస్సు డిపో నుంచి మీర్పేట్ వరకు వెళ్లడానికి200 రూపాయలకు బేరం కుదుర్చుకున్నాడు ఆటోడ్రైవర్. వృద్దురాలి నగల మీద కన్నేసిన డ్రైవర్ ఎవరూ లేనిది చూసి ఆటోను ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత నిర్మానుష్య ప్రదేశంలో ఆపాడు.
అనంతరం వృద్దురాలిపి బెదిరించి డబ్బులు,ఫోను, బట్టల బ్యాగుతో సహా నిలువు దోపిడికి పాల్పడి అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు కొవ్వూరు లక్ష్మి వయసు 74 సంవత్సరాలుగా పోలీసులు గుర్తించారు. మూడు రోజుల క్రితం సొంతూరు సంగారెడ్డి జిల్లాకు వెళ్లి పెన్షన్ డబ్బులు తీసుకుంది వృద్దురాలు. మీర్పేట్ లోని తన కూతురు దగ్గరకు వచ్చేందుకు సంగారెడ్డిలో బస్ ఎక్కి హైదరాబాదుకు చేరుకుంది.
ఈ క్రమంలో ఓ ఆటోడ్రైవర్ చేతిలో మోసపోయింది. తాను ఆటో డ్రైవర్ని చూస్తే గుర్తుపడతానని చెబుతుంది. బాధితురాలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితున్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వృద్దురాలిని మీర్పేట్ ఉంటున్న తన కూతురు వద్దకు క్షేమంగా చేర్చారు పోలీసులు.