మహబూబాబాద్, వెలుగు: రెండేళ్లుగా మహబూబాబాద్ కలెక్టర్గా పని చేస్తున్న అద్వైత్ కుమార్ సింగ్ బదిలీ కావడంతో జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ సెంటర్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ సంఘాల నాయకులు సంబరాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎల్ హెచ్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ భీమా నాయక్ మాట్లాడుతూ ఆయన కారణంగా మానుకోట జిల్లా అభివృద్దిలో వెనుకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ప్రజలను చులకనగా చూడడం, ప్రజల అర్జీలను చెత్తబుట్టలో వేసి ఆనందించే వ్యక్తి అని విమర్శించారు. గ్రీవెన్స్ రోజు మినహా ఇతర రోజుల్లో ప్రజలను కలవడని తెలిపారు. ఆఫీసుల్లో కూర్చొని ప్రతిరోజు ఖరీదైన స్నాక్స్, డ్రింక్స్, ఫ్రూట్స్, బిస్కెట్లు ఆరగిస్తూ కాలం గడిపాడని విమర్శించారు. భూసమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఔట్ సోర్సింగ్ నియమకాలు చేపట్టలేదని, కలెక్టర్ స్పెషల్ ఫండ్ను వినియోగించలేదన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపులోనూ నిర్లక్ష్యం చూపాడని విమర్శించారు. పాలనను ఏమాత్రం పట్టించుకోలేదని, ఆయన మూలంగా జిల్లా పూర్తిగా వెనుకబాటుకు గురైందని తెలిపారు. ఎల్ హెచ్ పీఎస్ జిల్లా అధ్యక్షుడు బోడా రమేశ్ నాయక్, మాజీ వైస్ ఎంపీపీ ఎల్ది మల్లయ్య, రవి పాల్గొన్నారు.
