హైదరాబాద్ నుంచి పాట్నా వెళ్తున్న ఇండిగో ఎయిర్లైన్స్ విమానంలో ఓ ప్రయాణికుడు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. బాత్రూమ్లోకి వెళ్లి లోపలి నుంచి గడియ పెట్టుకుని కాసేపు హల్చల్ చేశాడు. పాట్నాలో విమానం ల్యాండవగానే పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. 6ఈ 126 విమానంలో ఈ ఘటన జరిగింది.
ప్యాసింజర్ను కమార్ రియాజ్గా పోలీసులు గుర్తించారు. తన సోదరుడితో కలిసి అతడు విమానంలో పాట్నాకు బయలుదేరాడు. అయితే.. ప్రయాణికుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని, మెడికల్ రిపోర్టులు అతడి వద్ద ఉన్నాయని తెలిపారు. విమాన సిబ్బంది ఫిర్యాదు మేరకు అతడిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని వెల్లడించారు.