కూసుమంచి, వెలుగు : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడడంతో 15 మందికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లోక్యాతండా సమీపంలో హైవేపై శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. పీవై04ఏ7909 నంబర్ గల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి 31 మంది ప్యాసింజర్లతో రాజమండ్రి వెళ్తోంది. కూసుమంచి మండలం లోక్యాతండా సమీపంలోకి రాగానే బస్సు అదుపుతప్పి పల్టీ కొట్టింది.
ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన రమావత్ రవినాయక్, మల్ల దుష్యాంక్, కనపర్తి మహేశ్తో పాటు మిగిలిన 12 మందిని ఖమ్మం హాస్పిటల్కు తరలించారు. డ్రైవర్, రాజమండ్రికి చెందిన వాసంశెట్టి మురళీకృష్ణ బస్సును అతివేగంగా, అజాగ్రత్తగా నడపడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.