- ఔటర్ అవతల భారీగా రానున్న నిర్మాణాలు
- ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హెచ్ఎండీఏ
- పర్మిషన్లకు దరఖాస్తుల పరిశీలనలో అధికారులు
- నిర్మాణాలపై విధి విధానాలతో తయారైన పాలసీ
హైదరాబాద్, వెలుగు : ఔటర్ రింగ్రోడ్కు అవతల త్వరలోనే భారీగా శాటిలైట్ టౌన్షిప్ లు రానున్నాయి. ఇందుకు అనుమతులు ఇచ్చేందుకు హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. గ్రేటర్ సిటీలో పెరిగిన ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు శివారులో టౌన్షిప్ల నిర్మాణానికి ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించాలని అధికారులు నిర్ణయించారు. కొంతకాలం కిందటే నోటిఫికేషన్ జారీ అయింది. నిర్మాణాలపై రూల్స్, మౌలిక వసతుల కల్పనపై పాలసీని కూడా తయారు చేశారు. టౌన్షిప్ల నిర్మాణానికి ఆసక్తి చూపించే సంస్థలను ప్రోత్సహించడంతో పాటు
హెచ్ఎండీఏ నేరుగా ప్రభుత్వం భూముల్లో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో కూడా టౌన్షిప్లు నిర్మించనుంది. అందుకు ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయని అధికారులు ఆరా తీస్తున్నారు. శాటిలైట్ టౌన్షిప్లు పెరిగితే సిటీ మరింతగా విస్తరించనుంది. ఓఆర్ఆర్కు దూరంగా వీటిని నిర్మించడం ద్వారా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో పాటు, అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని ప్రభుత్వం భావించింది. సిటీలో పెరిగిపోతున్న ట్రాఫిక్ ఒత్తిడి చాలావరకు తగ్గుతుందని కూడా పేర్కొంటుంది.
వంద ఎకరాలు ఉంటేనే అనుమతి
ఔటర్ శివార్లలో టౌన్షిప్లను నిర్మించే వారు కనీసం 100 ఎకరాల భూమి కలిగి ఉండాలి. ఔటర్కు కనీసం 5కి.మీ. దూరంలో నిర్మించాలనే రూల్కూడా పెట్టారు. గతంలో నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు రెండు సంస్థలు టౌన్షిప్ల నిర్మాణానికి ముందుకొచ్చాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం దామర్లపల్లిలో 500 ఎకరాల్లో టౌన్షిప్ నిర్మాణానికి ఒక సంస్థ, ఇంకో చోట100 ఎకరాల్లో నిర్మాణానికి మరో సంస్థ దరఖాస్తులు చేశాయి. ఇంకొన్ని సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నట్టు అధికారులు తెలిపారు. టౌన్షిప్లలో వంద అడుగుల అప్రోచ్రోడ్ మస్ట్ గా ఉండాలని, మిగిలిన మౌలిక వసతులను కల్పించాలని రూల్పెట్టింది.
టౌన్షిప్ల నిర్మాణానికి ఛేంజ్ ఆఫ్ల్యాండ్ (భూ మార్పిడి) అనుమతులు అవసరం లేదని స్పష్టం చేసింది. టౌన్షిప్లలో తప్పనిసరిగా ఆటస్థలాలు, రోడ్లు, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, కాలుష్యం లేని పరిశ్రమలు పెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం ఓఆర్ఆర్ చుట్టూ టౌన్షిప్ల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి పెడుతుందన్నారు. అలాగే వాటి నిర్మాణాలకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. గ్రేటర్ పరిధిలో రోజు రోజుకూ పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణంతో సిటీపై ఒత్తిడి తగ్గుతుందని కూడా అధికారులు భావిస్తున్నారు.