గాంధీ మెడికల్ కాలేజీలో ఉన్నతాధికారుల బృందం తనిఖీ

గాంధీ మెడికల్ కాలేజీలో ఉన్నతాధికారుల బృందం తనిఖీ

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో శనివారం ఉన్నతాధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. రాష్ట్రంలోని 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 26 కాలేజీల్లో మౌలిక సదుపాయాల కొరతను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) గుర్తించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సంబంధిత వైద్య ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఉన్నతాధికారుల బృందం గాంధీ మెడికల్‌ కాలేజీ, హాస్పిటల్​ను స్వయంగా పరిశీలించింది.  

బోధన సిబ్బంది, లెక్చర్ హాళ్లు, ల్యాబ్‌లు, హాస్టల్, భద్రత, భోజన సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్బంగా నిర్వహించిన సమీక్ష సమావేశానికి  వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తు, కలెక్టర్ హరిచందన, డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా తాగునీరు, మరుగుదొడ్ల కొరత, స్టైపెండ్ ఆలస్యం గురించి  జూనియర్, పీజీ విద్యార్థులు ఫిర్యాదు చేయగా, దశలవారీగా సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.