లగేజీ మోసే ఉద్యోగం.. ఇంటర్ అర్హత చాలు.. డిగ్రీ వాళ్లే 25 వేల మంది వచ్చారు..!

లగేజీ మోసే ఉద్యోగం.. ఇంటర్ అర్హత చాలు.. డిగ్రీ వాళ్లే 25 వేల మంది వచ్చారు..!

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై సాక్షిగా నిరుద్యోగం ఏ స్థాయిలో విలయతాండవం చేస్తుందో ఓ ఘటన కళ్లకు కట్టింది. మంగళవారం సాయంత్రం ముంబైలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎయిర్ ఇండియా ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ 2,216 గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ పోస్టులకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులు దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో పనిచేయాల్సి ఉంటుంది.  ఉద్యోగంలో భాగంగా చేయాల్సిన పని ఏంటంటే.. విమానం నుంచి లగేజ్, కార్గో, ఫుడ్ సప్లయ్స్ను లోడింగ్, అన్ లోడింగ్ చేయడం. ఒక్కో విమానం నుంచి ఈ లోడింగ్, అన్ లోడింగ్కు ఐదుగురు లోడర్స్ అవసరం ఉంటుంది. ఎయిర్ పోర్ట్ లోడర్స్ శాలరీ రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకూ ఉంటుంది. అయితే.. ఈ ఉద్యోగంలో పనిచేసే వారిలో ఎక్కువ మంది అలవెన్స్ల కోసం ఓవర్ టైం పనిచేసి రూ.30 వేల వరకూ సంపాదిస్తుంటారు.

Also Read:-ఎయిర్పోర్ట్లో మెకానిక్ ఉద్యోగాలు.. బారులు తీరిన నిరుద్యోగులు..

ఈ ఉద్యోగాలను హ్యాండీమెన్ పోస్టులు అని కూడా అంటారు. ఈ ఉద్యోగాలకు విద్యార్హత అవసరం అయినప్పటికీ, శారీరకంగా కూడా అభ్యర్థులు దృఢంగా ఉండాలి. ఉన్నమాట చెప్పాలంటే.. ఈ ఉద్యోగాల కోసం పీజీలు చేయాల్సినంత పనిలేదు. ఈ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు 2,216 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే 25 వేల మందికి పైగా నిరుద్యోగులు ఈ జాబ్స్ కోసం క్యూ కట్టారు. ముంబైలోని రిక్రూట్ మెంట్ ఆఫీస్ ముందు తిండీతిప్పలు మానేసి ఉద్యోగం కోసం గంటల పాటు నిరీక్షించారు. వీళ్లలో కొందరు అస్వస్థతకు కూడా లోనయ్యారు.

పరిస్థితి ఎలా ఉందంటే.. ఎంకామ్, బీబీఏ, బీకాం చదివిన పట్టభద్రులు కూడా హ్యాండీమెన్ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ డ్రైవ్లో జాబ్ సంపాదించేందుకు ముంబై కలినా ఎయిర్ పోర్ట్ ముందు పడిగాపులు కాశారు. తొక్కిసలాట జరిగింది. 400 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ ఉద్యోగాల కోసం ముంబైకి వెళ్లిన అభ్యర్థులు కూడా ఉన్నారంటే నిరుద్యోగం యువతకు ఎంతటి శాపంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. చదివిన చదువుకు తగిన ఉద్యోగం లేక ర్యాపిడోకు, స్విగ్గీ, జొమాటోకు డెలివరీ బాయ్స్గా వెళుతున్న వాళ్లు మన దేశంలో ఎందరో ఉన్నారు. ఈ ఒక్క ఘటనే కాదు.. సరిగ్గా కొన్ని రోజుల క్రితం ఇలాంటి ఘటనే గుజరాత్ లోని బరుచ్ జిల్లాలోని అంక్లేశ్వర్ లో వెలుగుచూసింది. 10 పోస్టుల కోసం 1,800 మందికి పైగా నిరుద్యోగ యువత ఒక ప్రైవేట్ సంస్థ ముందు తొక్కుకుంటూ, తోసుకుంటూ కనిపించారు. అంతమంది ఒకేసారి తోసుకోవడంతో ఆఫీస్ రైలింగ్ కూలిపోయింది. అదృష్టవశాత్తూ ఆ రైలింగ్ తక్కువ ఎత్తులో ఉండటం వల్ల ఎవరికీ ఏం కాలేదు. దేశంలోనే అభివృద్ధి చెందిన ప్రాంతాలుగా చెప్పుకునే ముంబై, గుజరాత్లోనే నిరుద్యోగం ఈ స్థాయిలో ఉందంటే.. ఇక మిగిలిన రాష్ట్రాల్లో నిరుద్యోగ యువత కష్టాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.