రేవంత్పై కేటీఆర్ పరువు నష్టం దావా
టెస్టుకు రమ్మంటే కోర్టుకెందుకు ఎక్కినవన్న రేవంత్
గన్పార్క్కు వెళ్లి వెయిట్ చేసిన పీసీసీ చీఫ్
లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా?
నేను ఏ టెస్టుకైనా రెడీ. రాహుల్గాంధీ సిద్ధపడితే ఇద్దరం ఢిల్లీలోని ఎయిమ్స్లో డ్రగ్స్ టెస్టులు చేయించుకుంటాం. డ్రగ్స్ టెస్టుల్లో నాకు క్లీన్చిట్ వస్తే రేవంత్ క్షమాపణ చెప్పి పీసీసీ నుంచి తప్పుకోవాలి. ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ పరీక్షలకు రేవంత్ సిద్ధమా? ‑ మంత్రి కేటీఆర్
రెడీ.. డేటు, టైం ఫిక్స్ చెయ్
సినీ నటులను విచారణకు పిలిస్తే కేటీఆర్ ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ టెస్టుకు వస్త. డేటు, టైం ఫిక్స్ చేయండి. మరి సహారా పీఎఫ్, ఈఎస్ఐ కుంభకోణాల కేసుల్లో లై డిటెక్టర్ టెస్టుకు కేసీఆర్ సిద్ధమా? ‑ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి
పాదయాత్ర తర్వాత వస్తా
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విసిరిన వైట్ చాలెంజ్ స్వీకరించేందుకు నేను సిద్ధం. బలిసినోళ్లే డ్రగ్స్ తీసుకుంటారు. పేదోడికి అవసరం లేదు. నాకు ఎలాంటి అలవాట్లు లేవు. అక్టోబర్ 2న నా పాదయాత్ర ముగిసిన తర్వాత ఎక్కడికి రమ్మన్నా వచ్చి టెస్టు చేయించుకోవడానికి రెడీ. ‑ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారంలో నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. డ్రగ్స్ టెస్టులు చేయించుకుంటామని ప్రకటించిన ఇద్దరు నేతలు.. లై డిటెక్టర్ టెస్టును తెరమీదికి తెచ్చారు. ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ టెస్టుకు రేవంత్ సిద్ధమా అని కేటీఆర్ ప్రశ్నిస్తే.. సహారా, ఈఎస్ఐ స్కాంలో లై డిటెక్టర్ టెస్టుకు కేసీఆర్ రెడీనా అని రేవంత్ కౌంటర్ ఇచ్చారు. మొత్తంగా డ్రగ్స్ వ్యవహారం టీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య దుమారం రేపుతోంది. సవాళ్లు ప్రతిసవాళ్లతో రాజకీయ వేడి పుట్టిస్తోంది.
టెస్టులకు రెడీ.. కండిషన్స్ అప్లై
మొన్న మీడియాతో చిట్ చాట్ చేసిన మంత్రి కేటీఆర్.. ‘‘నాకు డ్రగ్స్ కేసుతో ఎలాంటి సం బంధం లేదు. టెస్టు కోసం కావాలంటే నా రక్తం, వెంట్రుకలు, లివర్లో చిన్నముక్క ఇచ్చేందుకు రెడీ” అని ప్రకటించారు. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి తానూ టెస్టులకు రెడీ అని చెప్పారు. కేటీఆర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి డ్రగ్స్ టెస్టులకు సిద్ధం కావాలని, వారికి తాను వైట్ చాలెంజ్ విసురుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో డ్రగ్స్ వాడటం వల్ల కలిగే చెడు పరిణామాలపై యువతకు అవగాహన కల్పించాడానికి తాను వైట్ చాలెంజ్ విసురుతున్నానని కేటీఆర్ సోమవారం ఉదయం ట్వీట్ చేశారు.
గన్ పార్క్ వద్ద మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి టెస్టుల కోసం ఎదురు చూస్తుంటానని పేర్కొన్నారు. తాను ఏ టెస్టులకైనా సిద్ధమని, రాహుల్గాంధీ సిద్ధపడితే ఇద్దరం ఢిల్లీలోని ఎయిమ్స్లో టెస్టులు చేయించుకుంటామని అన్నారు. చర్లపల్లి జైలు నుంచి వచ్చిన వ్యక్తి సవాల్ను స్వీకరించి తన స్థాయి తగ్గించుకోబోనని మెలికపెట్టారు. డ్రగ్స్ పరీక్షల్లో తనకు క్లీన్చిట్ వస్తే రేవంత్ క్షమాపణ చెప్పి పీసీసీ చీఫ్ పోస్టు నుంచి తప్పుకోవాలన్నారు. ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అని సవాల్ చేశారు. దీనిపై స్పందించిన రేవంత్.. ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ టెస్టు డేటు, టైం ఫిక్స్ చేయాలని రీ ట్వీట్ చేశారు. సహారా ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ హాస్పిటళ్ల కుంభకోణాల కేసుల్లో కేసీఆర్పై సీబీఐ విచారణ జరుపుతోందని, ఆ కేసుల్లో ఆయన లై డిటెక్టర్ చేయించుకోవాలని, తాను చేయించుకుంటానని ప్రకటించారు.
చాలెంజ్ స్వీకరిస్తే కేటీఆర్ స్థాయి పెరిగేది: కొండా
రేవంత్ విసిరిన వైట్ చాలెంజ్ స్వీకరించి ఉంటే మంత్రి కేటీఆర్ స్థాయి పెరిగేదని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. గన్ పార్క్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో స్థాయిల గురించి మాట్లాడటం సరికాదని.. పెద్ద నేతలు చిన్న వ్యక్తుల దగ్గరికి వెళ్లి మాట్లాడుతారని చెప్పారు. ఎన్నికల్లో నిలబడే ప్రతి లీడర్ డ్రగ్స్ టెస్టు చేయించుకోవాలని, ఎన్నికల కమిషన్ ఈ మేరకు రూల్ తీసుకురావాలన్నారు. రాహుల్గాంధీ గురించి కేటీఆర్ తొందరపాటుతో మాట్లాడుతున్నారని, ఇది రాష్ట్రానికి సంబంధించిన సమస్య మాత్రమేనని చెప్పారు. బండి సంజయ్, బీఎస్పీ కో ఆర్డినేటర్కు తాను వైట్ చాలెంజ్ విసురుతున్నానని చెప్పారు. ఇంకో ఇద్దరికి అవకాశముంటే ప్రొఫెసర్ కోదండరాం, తీన్మార్ మల్లన్నకు చాలెంజ్ చేసే వాడినని తెలిపారు. కాగా, విశ్వేశ్వర్రెడ్డి చాలెంజ్ను బండి సంజయ్ స్వీకరించారు. ఎలాంటి టెస్టుకైనా తాను సిద్ధమన్నారు.
కేటీఆర్ రెడీ అన్నందుకే వచ్చిన
తాను విసిరిన వైట్ చాలెంజ్లో పాల్గొనేందుకు కేటీఆర్ రావాలన్న రేవంత్ రెడ్డి.. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆయన కోసం గన్పార్క్ వద్ద వెయిట్ చేశారు. ‘‘కేటీఆర్ టెస్టుకు సిద్ధమన్నాడు కాబట్టే నేను గన్ పార్క్కు రమ్మని చెప్పాను. సమాజానికి ఆదర్శంగా నిలుద్దామనే వైట్ చాలెంజ్ విసిరాను. అందరం డ్రగ్స్ టెస్టులు చేయించుకొని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందాం. నేనేం కేటీఆర్ ఆస్తులు అడగడం లేదు. ఆయన ఎప్పుడు వచ్చినా అమరవీరుల స్తూపం వద్ద సిద్ధంగా ఉంటా” అని చెప్పారు. తన సవాల్పై ఇయ్యాల ఢిల్లీ అంటున్న కేటీఆర్.. రేపు ట్రంప్ రావాలని అంటాడని వాళ్లను తాను ఎక్కడి నుంచి తీసుకురావాలని ప్రశ్నించారు. ‘‘ఆయన కోర్టుకు ఎందుకు వెళ్తున్నారు? బెదిరింపు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? సినీ నటులను డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు పిలిస్తే కేటీఆర్ ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? మంత్రిగా కేటీఆర్కు బాధ్యత లేదా?” అని నిలదీశారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన సవాల్ను స్వీకరించారని, కేటీఆర్ ఎందుకు ఆవేశానికి గురవుతున్నారో చెప్పాలన్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఉస్మానియా హాస్పిటల్లో టెస్టులకు రావాలన్నారు. రాజకీయంగా కేటీఆర్ తనకు వెంట్రుకతో సమానమని, మంత్రి పదవిలో ఉన్నాడు కాబట్టి ఆ మాట అనడం లేదన్నారు. సింగరేణి కాలనీ ఘటన డ్రగ్స్ కారణంగానే జరిగిందన్నారు. కేటీఆర్ దత్తత తీసుకున్న కాలనీలో డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఆరు పబ్బులకు పర్మిషన్ ఇస్తే, టీఆర్ఎస్ 60 పబ్బులకు అనుమతిచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటల తర్వాత పబ్బుల్లో ఒక రౌండ్ తిరిగితే నిజాలు తెలుస్తాయన్నారు.
అమరవీరుల స్తూపం శుద్ధి చేసిన టీఆర్ఎస్ లీడర్లు
గన్పార్క్లోని తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని టీఆర్ఎస్ నేతలు పాలతో శుద్ధి చేశారు. తెలంగాణ యువత బలిదానాలకు కారణమైన కాంగ్రెస్ నేతల రాకతో అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ అన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ఇరికించి హైదరాబాద్ విడిచి వెళ్లేందుకు కారకుడైన రేవంత్.. ఇప్పుడు డ్రగ్స్ వివాదంలోకి రాహుల్ గాంధీని లాగారని అసెంబ్లీ ఆవరణలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మీడియాతో అన్నారు.
రేవంత్పై కేటీఆర్ పరువు నష్టం దావా
రాజకీయ దురుద్దేశాలతోనే తనపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రేవంత్రెడ్డిపై సిటీ సివిల్ కోర్టులో మంత్రి కేటీఆర్ పరువునష్టం దావా వేశారు. కొంతకాలంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డ్రగ్స్ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చేపట్టిన విచారణకు హాజరవుతున్న వారితో, ఆ కేసులతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న రేవంత్పై చర్యలు తీసుకోవాలని, తన పరువుకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించడంతో క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రారంభించాలని పిటిషన్లో కోర్టును కోరారు. కోర్టులపై తనకు గౌరవముందని, నిందితులపై తగిన చర్యలు తీసుకుంటారని నమ్మకం ఉందని అన్నారు. కేటీఆర్ వేసిన పిటిషన్ కోర్టు పరిశీలనలో ఉంది.