సుప్రీం తీర్పు తర్వాతా ప్రైవేట్ కంపెనీలకు ఈకేవైసీ అధికారాలు
ప్రతి దానికి దానికీ గుర్తింపుగా ఆధార్ అడుగుతున్నారు. బ్యాంకు అకౌంట్ తెరవాలన్నా, పాన్ కార్డు రావాలన్నా, ఉపాధి కూలీ పైసలు ఖాతాల పడాలన్నా, ఫోన్లో సిమ్ కావాలన్నా.. అది లేనిదే పని జరగట్లేదు. బయోమెట్రిక్లో వేలి ముద్రలు ఇవ్వాల్సిందే. అది కూడా కస్టమర్ ఇష్టపూర్వకంగానే తీసుకోవాల్సి ఉంటుంది. దాన్నే ఈకేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) అని అంటారు. అయితే, ప్రైవేట్ కంపెనీలు ఈకేవైసీ తీసుకోవద్దంటూ గత ఏడాది సెప్టెంబర్లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పుతో టెలికాం కంపెనీలు, ప్రైవేట్ బ్యాంకులకు పెద్ద దెబ్బే పడింది. కానీ, ఈ తొమ్మిది నెలల్లో మాత్రం ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. చిన్నచిన్నగా ఆధార్ను ప్రైవేట్ కంపెనీలూ వాడుకునేలా కేంద్ర ప్రభుత్వం, ఆధార్ అధీకృత సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)లు పావులు కదిపాయి. ఆధార్ చట్టంలోని చిన్న చిన్న లొసుగులను అడ్డం పెట్టుకుని కంపెనీలు ఆధార్ వాడుకునేలా చేశాయి. తద్వారా ‘కోర్టు ధిక్కారం’ కిందకు రాకుండా జాగ్రత్తపడ్డాయి. అయితే, కొందరు న్యాయ నిపుణులు మాత్రం స్వచ్ఛందంగాగానీ, బలవంతంగాగానీ కంపెనీలు ఆధార్ వివరాలు తీసుకోకుండా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదీ అటార్నీ జనరల్ అభిప్రాయం
సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఖాతాల్లోకే నగదు బదిలీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్/డీబీటీ), ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను ప్రైవేట్ కంపెనీలు ఎలా వాడుకోవచ్చో అటార్నీ జనరల్ చెప్పారు. ఈ విషయంపైనే అటార్నీ జనరల్(ఏజీ) అభిప్రాయాన్ని యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే తీసుకున్నారు. నాలుగు అంశాలపై ఆయన సలహాలు తీసుకున్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఏజీ చెప్పిన అభిప్రాయాలు వెలుగులోకి వచ్చాయి. అందులో మొదటి ప్రశ్న, బ్యాంకులు, టెలికాం కంపెనీలకు యూఐడీఏఐ ద్వారా అథెంటికేషన్ సేవలు అందించవచ్చా అని అజయ్ భూషణ్ అడిగారు. ‘‘పార్లమెంట్లో చట్టం చేసేంత వరకు ఆధార్ యూజర్లు స్వచ్ఛందంగా నంబర్ ఇవ్వడానికి ఒప్పుకున్నా టెలికాం కంపెనీలకు గానీ, బ్యాంకులకు గానీ యూఐడీఏఐ వివరాలు ఇవ్వకూడదు” అని సమాధానం చెప్పారు.
మరి, ఆధార్ చట్టంలోని సెక్షన్ 7 కింద డీబీటీ కోసం బ్యాంకులు వాడుకోవచ్చా అన్న దానికి తప్పులేదని పేర్కొన్నారు. ‘‘సబ్సిడీలు, సేవలు, ఇతర అవసరాల కోసం సెక్షన్ 7 కింద ఆధార్ వివరాలు చట్టం ప్రకారం తప్పనిసరి. కాబట్టి సబ్సిడీలు ఇవ్వడానికి, నగదు బదిలీ, ఆధార్ ఆధారిత మైక్రో ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసేందుకు సెక్షన్ 7 కింద బ్యాంకులు లబ్ధిదారుల ఆధార్ వివరాలను తీసుకోవచ్చు” అని ఏజీ వివరించారు. ఏజీ వివరణలతో 2018 అక్టోబర్ నుంచే బ్యాంకులు ఈకేవైసీ వివరాలు తీసుకునేందుకు యూఐడీఏఐ అనుమతిచ్చింది. ప్రైవేట్ కంపెనీలకూ అదే ఏడాది నవంబర్లో ఈకేవైసీపై లేఖలు పంపింది. ఈకేవైసీని సెక్షన్ 7 వరకు మాత్రమే పరిమితం చేయాలని, లేకపోతే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని ఆ లేఖల్లో ప్రైవేట్ కంపెనీలకు సూచించింది. సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా అవగాహన చేసుకోవాలని సూచించింది. దాని ప్రకారమే నడుచుకోవాలని ఆదేశించింది. ఒకవేళ ఆ తీర్పును పట్టించుకోకపోతే కంపెనీలదే పూర్తి బాధ్యత అని కూడా చెప్పింది.