హైదరాబాద్, వెలుగు: అటు అభయ హస్తం స్కీం ఆగిపోయింది. ఇటు ఆసరా పెన్షన్ ఇస్తలేరు. దీంతో అర్హులుగా ఉన్నా పెన్షన్ లు రాక రాష్ట్రంలో లక్షలాది మంది మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. అభయ హస్తం స్కీంను రద్దు చేయడంతో ఆ స్కీం లబ్ధిదారుల్లోని అర్హులకు ఆసరా పెన్షన్లు ఇస్తామని, అర్హులు కానివారికి స్కీం కోసం కట్టిన డబ్బును వాపస్ చేస్తామని చెప్పిన సర్కార్.. ఏడాది అవుతున్నా పట్టించుకోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమకు పెన్షన్ మంజూరు చేయాలని మహిళలు కోరుతున్నారు.
స్కీమ్లో 23.28 లక్షల మంది
2009లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి అభయ హస్తం పెన్షన్ స్కీంను ప్రారంభించారు. స్కీంలో చేరిన మహిళలకు నెలనెలా రూ. 500 పెన్షన్ ఇచ్చేవారు. భర్తకు వచ్చే రూ. 200 వృద్ధాప్య పెన్షన్తో సంబంధం లేకుండా అభయ హస్తంలో చేరిన మహిళకు కూడా పెన్షన్ వచ్చేది. దీంతో ఈ స్కీమ్లో 23,28,014 మంది సభ్యులుగా చేరారు. వీళ్లలో తెలంగాణ ఏర్పాటు నాటికి 2.20 లక్షల మంది అభయ హస్తం పెన్షన్ తీసుకునేవారు. 2015 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పెన్షన్ స్కీమ్ కింద రూ. 1000 ఇస్తున్నారు. ఈ స్కీమ్కు అర్హులైన1,33,415 మంది అభయ హస్తం సభ్యులను ఆసరా పరిధిలోకి మార్చారు. మిగతా 86,597 మందికి 2016 అక్టోబర్ నుంచి అభయ హస్తం పెన్షన్ నిలిచిపోయింది. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో వారికి ఎలాంటి పెన్షన్ రావట్లేదు. ఏడాది క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేసింది. అప్పటికే 1.90 లక్షల మంది మహిళలను ఆసరా పెన్షన్కు అర్హులుగా అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో ఈ సంఖ్య ప్రస్తుతం మరో 40 వేలు పెరిగిందని అంచనా. అయినా వీరికి ఆసరా పెన్షన్ మంజూరు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
డబ్బులు వాపస్ ఇవ్వలే
అభయహస్తం స్కీమ్లో చేరిన మహిళలు రోజుకు రూపాయి చొప్పున ఏడాదికి రూ. 365 చెల్లిస్తే ప్రభుత్వం అంతే మొత్తంలో జమచేసేది. ఇలా జమ అయిన డబ్బులు రూ.1,500 కోట్లకు పైగా ఉన్నాయి. ఈ డబ్బులు ప్రస్తుతం ఎల్ఐసీ వద్ద ఉన్నాయి. ఆసరా పరిధిలోకి వచ్చే మహిళలకు ఆసరా పెన్షన్ ఇస్తామని, ఈ స్కీమ్ పరిధిలోకి రానోళ్లకు డబ్బులు వాపస్ ఇస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కానీ ఏడాది గడిచినా వారికి డబ్బులు వాపస్ ఇయ్యలేదు.