ఆదిలాబాద్ : వారసంతలు నడవకపోవడంతో ఆదివాసీలు ఇబ్బందులు పడుతున్నారు. వీరు పప్పులు, ఉప్పు, బియ్యం, నూనె, ఎండు చేపలు, వడియాలు, తదితర నిత్యావసర సరుకులు మొదలు ఫేస్ పౌడర్, జండూబామ్ దాకా అన్నీ అక్కడే కొంటారు. అయితే ప్రస్తుతం లాక్డౌన్తో సంతలు నడవక, ఇళ్లలో సరుకులు లేకుండా పోయాయి. ఆదివాసీలు వస్తువులు ఎక్కువ కాలం ఉంటే పాడై పోతాయని భావిస్తారు. నెలకు సరిపడా కాకుండా కేవలం వారానికి సరిపడా మాత్రమే కొంటుంటారు. తాము నడిచి వెళ్లేందుకు అందుబాటులో ఉండే సంతలనే ఇందు కోసం ఎంచుకుంటారు. బయట ధరతో పోల్చితే ఇక్కడ తక్కువ ధరకు సరుకులు వస్తాయని వీరి నమ్మకం.
వ్యాపారులు తెచ్చేవే కొంటారు..
ఆదివాసీలు అందరూ వాడే వస్తువులు ఎక్కువగా వాడరు. టీవీల్లో ఎన్ని యాడ్లు వచ్చినా వాటిని కొనరు. సంతకు వ్యాపారులు తీసుకువచ్చే వాటినే కొంటుంటారు. బయట కిరాణాలలో కూడా ఎక్కువగా వస్తువులు కొనుగోలు చేయరు. వీరి కోసం వ్యాపారులు తక్కువ ధరకు లభించే వస్తువులు తెస్తుంటారు. వారిపై నమ్మకంతో వారిచ్చిన వాటినే కొనుగోలు చేస్తారు. ఇప్పుడు సరుకులు తెచ్చే వ్యాపారులు లేక కష్టపడుతున్నారు. తాము దూరం, దూరంగా ఉండి సరుకులు కొనుక్కుంటామని, సంతలు స్టార్ట్ చేయాలని వారు కోరుతున్నారు.
సంత నడపండి
మాకు వార సంత లేకపోతే మనుసుల పట్టదు. అక్కడ సామాన్ కొంటేనే తృప్తిగా ఉంటుంది. మేమంతా దూరందూరంగా ఉండి సామాన్లు కొంటాం. సంతలను ప్రారంభించండి.
-గున్ను పటేల్, గ్రామ పెద్ద