
టీఎస్ పీఎస్సీ(TSPSC) కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పేపర్ లీక్ ఘటనకు నిరసనగా ఏబీవీపీ టీఎస్ పీఎస్ సీ ముట్టడికి ప్రయత్నించింది. TSPSC లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వచ్చిన వారిని వచ్చినట్లుగా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో విద్యార్థులకు పోలీసులకు తీవ్ర తోపులాట జరిగింది. ఇందులో పలువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి.
అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీలో టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. పేపర్ లీకేజీ ఘటనకు బాద్యత వహిస్తూ, సీఎం కేసీఆర్, టీఎస్ పీఎస్ సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామా చేయాలన్నారు. పేపర్ లీక్ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. TSPSC ని మొత్తం ప్రక్షాళన చేయాలన్నారు. మొత్తం ఎన్ని పరీక్షల పేపర్లు లీకేజీ చేశారో ఆయా పరీక్షలను మొత్తం రద్దు చేసి మళ్ళీ పరీక్షలను నిర్వహించాలని కోరారు.
పేపర్ లీక్ కేసులో ఇప్పటికే 9 మంది నిందితులకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏఈ పరీక్షను రద్దుచేయాలా వద్దా అనేదానిపై టీఎస్ పీఎస్సీ కాసేపట్లో నిర్ణయం తీసుకోనుంది.