
- ఇకపై అకౌంట్స్తో పాటు అకడమిక్ అంశాలూ పరిగణనలోకి..
- ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల నిర్ధారణపై సర్కార్ ఉత్తర్వులు
- మేనేజ్మెంట్లతో మళ్లీ భేటీ కానున్న టీఏఎఫ్ఆర్సీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కాలేజీల్లో ఫీజుల నిర్ధారణకు ఇక నుంచి అకౌంట్స్తో పాటు అకడమిక్ ప్రమాణాలనూ పరిగణనలోకి తీసుకోనున్నారు. ఫీజుల ఖరారుకు సంబంధించి ఆయా కాలేజీలకు జాతీయ, అంతర్జరాతీయ స్థాయిలో దక్కిన ర్యాంకులు, అవార్డులు, వాటిల్లో ఉన్న సౌలతుల ఆధారంగా వెయిటేజీ ఇవ్వనున్నారు. ఈ మేరకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులరేటరీ కమిటీ గైడ్లైన్స్–2006కు సవరణలు చేస్తూ ప్రభుత్వం గురువారం జీవో నెంబర్ 33 రిలీజ్ చేసింది. ప్రైవేట్ ఇంజినీరింగ్, ప్రొఫెషనల్ కాలేజీల్లో ఫీజుల నిర్ధారణ కోసం కొత్త గైడ్లైన్స్ రూపొందించేందుకు టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన కమిటీ పలు సిఫార్సులు చేయగా.. వాటికి అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వీటి ఆధారంగానే ఇంజినీరింగ్ కాలేజీల్లో రానున్న మూడేండ్లకు గాను ఫీజులను నిర్ధారించనున్నారు. కాలేజీ మేనేజ్మెంట్లు ప్రతిఏటా అడ్మిషన్ల నోటిఫికేషన్కు ముందే తమ ప్రతిపాదిత ఫీజు వివరాలను టీఏఎఫ్ఆర్సీకి అందించాలి. దీనికి ఆదాయ, వ్యయాల వివరాలతో పాటు సంబంధిత పత్రాలూ జత చేయాల్సి ఉంటుంది.
ఇకపై అవన్నీ పరిశీలించి..
ఫీజుల నిర్ధారణలో ఇప్పటి వరకు కాలేజీల ఆదాయ, వ్యయాలే కీలకంగా ఉండేవి. దీంతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్న, మంచి పేరున్న కాలేజీలను కూడా ఇతర కాలేజీలతో సమానంగా చూసేవారు. అయితే ఇక నుంచి అకాడమిక్ అంశాలనూ ఫీజుల నిర్ధారణలో పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. కాలేజీల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇంటర్నల్ క్వాలిటీ ఎస్యూరెన్స్ సిస్టమ్ అంశాలను చూడనున్నారు. దీంతో పాటు స్టూడెంట్లకు అందించే సౌకర్యాలు, అటెండెన్స్, ప్లేస్మెంట్స్, ఫేషియల్ రికగ్నైజ్ అటెండెన్స్ సిస్టమ్, రీసెర్చ్, ఇన్నోవేషన్స్ ఏకో సిస్టమ్, స్టార్టప్స్, రీసెర్చ్ పబ్లికేషన్స్, అవార్డులనూ పరిశీలనలోకి తీసుకోనున్నారు.
మళ్లీ హియరింగ్..
కొత్త నిబంధనలకు అనుగుణంగా ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్లతో టీఏఎఫ్ఆర్సీ మరోసారి భేటీ కానున్నది. రాష్ట్రంలోని 160 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు ఈ నెల 25 నుంచి వచ్చే నెల 3 వరకు హియరింగ్ ఉంటుందని కమిటీ ప్రకటించింది. ఈ మేరకు గురువారం షెడ్యూల్ రిలీజ్ చేసింది.