ESI స్కామ్..అక్రమాలను తవ్వుతున్న ఏసీబీ

ESI స్కామ్..అక్రమాలను తవ్వుతున్న ఏసీబీ

ఈఎస్ఐ స్కామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. షెల్ కంపెనీ అయినటువంటి లెజెండ్ సంస్థ ఓనర్ కృపాసాగర్ ని బినామిగా చేర్చి ఓమ్ని చైర్మన్ శ్రీహరి బాబు అలియాస్ బాబ్జి చేసిన అక్రమాలను తవ్వి తీస్తున్నారు ఏసీబీ అధికారులు. క్యూవేట్ అనే వైట్ బ్లడ్ శాంపిల్స్ కిట్ల కొనుగోలులో భారీ అక్రమాలు జరిగాయని గుర్తించింది ఏసీబీ. 2017-18 సంవత్సరంలోరూ. 23 కోట్ల విలువైన 6291 యూనిట్స్ కొన్నట్లుగా డాకుమెంట్స్ గుర్తించారు అధికారులు. అసలు ధర కంటే 200 శాతం ఎక్కువ ధరకి క్యూవేట్ పరికరాలను కొన్నట్లు ఆధారాలు సేకరించారు. ఒక్కో క్యూవేట్ యూనిట్ రూ.11800 ఉంటే రూ. 36800లకు కొని.. ప్రభుత్వ ధనాన్ని కాజేశారు.  దీనిద్వారా రూ.11 కోట్ల ప్రభుత్వ సొమ్ము కాజేశారు శ్రీహరిబాబు. 2017-18 సంవత్సరంలో లెజెండ్ కంపెనీ నుండి ఓమ్ని కంపెనీకి రూ.54 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయని గుర్తించింది ఏసీబీ.

ప్రభుత్వ నిధులు దోచుకునేందుకు డ్రగ్ కంట్రోల్, కమర్షియల్ టాక్స్, ఆఫీస్ అడ్రెస్ కు సంబంధించి 3 వేర్వేరు అడ్రెస్ లు నమోదు చేసింది లెజెండ్ కంపెనీ. స్విజర్లాండ్ కంపెనీ అయిన హీమోక్యూ కంపెనీలో ఏరియా మేనేజర్ గా పని చేస్తున్న వెంకటేశ్.. హీమోక్యూ కంపెనీకి తెలియకుండా ఫేక్ ఆథరైజేషన్ లెటర్ తయారు చేశాడు. లెంజెండ్ కంపెనీ నుండి డైరెక్టర్ IMSకి,.. హీమోక్యూ నుండి ఓమ్ని హెల్త్ కేర్ కి ఒకే బ్యాచ్ నెంబర్ తో ఉన్న లెటర్స్ పంపారు. ఈ వ్యవహారంలో ఓమ్ని చైర్మన్ శ్రీహరిబాబు అలియాస్ బాబ్జి, హీమోక్యూ ఏరియా మేనేజర్ వెంకటేష్ ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు ACB అధికారులు. లెజెండ్ కంపెనీ యజమాని కృపాసాగర్ కోసం గాలిస్తున్నారు. కృపాసాగర్ ని విచారిస్తే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం ఉంది.