హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లోని ఓ పబ్ నుంచి మామూళ్లు తీసుకుంటున్నారనే కేసులో బంజారాహిల్స్ సీఐ నరేందర్, అడ్మిన్ ఎస్ఐ నవీన్ రెడ్డి, హోంగార్డు హరిలకు ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ సంద ర్భంగా సోమవారం విచారణకు హాజరు కావాలని సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులిచ్చారు. మామూళ్ల కోసం వేధిస్తున్నారంటూ రాక్ క్లబ్ స్కైలాంజ్ మేనేజింగ్ పార్ట్నర్ రాజేశ్వర్ లక్ష్మణ్ రావు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో సీఐ, ఎస్ఐ, హోంగార్డును ప్రశ్నించారు. శుక్రవారం ఉదయం ప్రారంభమైన విచారణ శనివారం కూడా కొనసాగింది.
ముగ్గురి బ్యాంక్ అకౌంట్స్ను అధికారులు పరిశీలించారు. బాధితుడు రాజేశ్వర్ లక్ష్మణ్ రావును శుక్రవారం రాత్రి 1.30 గంటల పోలీస్ స్టేషన్కి పిలిపించి, సీఐ నరేందర్ సమక్షంలో ప్రశ్నించారు. హోంగార్డ్ హరి కాల్ డేటా, వాట్సప్ కాల్స్ను సేకరించారు. బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం గత నెల 30న రాత్రి లక్ష్మణ్ రావును పీఎస్కి తీసుకువచ్చారా అనే కోణంలో ఆధారాలు సేక రించారు. కాగా, పబ్స్, స్పాలు, ఇతర ప్రైవేట్ సంస్థల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్న వారి గురించి అధికారులు అంతర్గత విచారణ జరుపుతున్నారు. స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ పోలీసులను నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.