
శ్రీకాకుళం జిల్లాలో ఎస్ ఈ బీ అధికారులపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. పొందూరు మండలంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) సీఐ శ్రీనివాసరావు, ఎస్సై మురళి 15 వేల రూపాయిలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు.
శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడాం మండలం నిద్దంకు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మే 25వ తేదీన ఐదు మద్యం సీసాలను తీసుకెళ్తుండగా పొందూరు సమీపంలో ఎస్ఈబీ అధికారులు పట్టుకొన్నారు. దీనిపై కేసు నమోదు చేయకుండా ఉండాలంటే 15 వేల రూపాయలు లంచం ఇవ్వాలని సీఐ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. రూ. 15 వేలు ఇస్తే అతడికి బదులుగా మరో వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని చెప్పారు. అంత నగదు ఇవ్వలేని పరిస్థితుల్లో రూ. 5వేల రూపాయలు ఇచ్చి.. తన కేసును మరొకరిపై నమోదు చేసేందుకు అతడే మరో వ్యక్తిని తీసుకుని రావాలని నిందితుడితో సీఐ అన్నారు.
నిందితుడు లంచం ఇస్తే.. అతడిని కేసు నుంచి తప్పిస్తామని ఆయన చెప్పారు. అయితే నిందితుడు నగదు ఇవ్వకపోవటంతో రోజూ అతడిని స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు. దీంతో విసుగు చెందిన నిందితుడు.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు నిందితుడు ఎస్ఈబీ.. సీఐకీ ఫోన్ చేసి అడిగిన నగదును ఇస్తానని చెప్పాడు. అయితే తాను విశాఖపట్నంలో ఉన్నానని.. డబ్బులను స్టేషన్లో ఉన్న ఎస్ఐకు ఇవ్వమని సీఐ చెప్పారు. దీంతో నిందితుడు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్ఐ మురళికి రూ. 15 వేలు లంచం ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. విశాఖలో ఉన్న శ్రీనివాసరావును ఏసీబీ అధికారులు పొందూరు తీసుకొచ్చారు. సీఐ,ఎస్ఐలను అరెస్టు చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.