- మెదక్ జిల్లా టేక్మాల్లో ఘటన
- రైతు నుంచి లంచం తీసుకుంటూ చిక్కిన ఎస్సై రాజేశ్
- పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్న ప్రజలు
మెదక్/టేక్మాల్, వెలుగు: రైతు నుంచి లంచం తీసుకున్న ఓ ఎస్సై ఏసీబీ అధికారులను గమనించిన స్టేషన్ వెనుక వైపు నుంచి పారిపోగా.. ఏసీబీ అధికారులు 20 నిమిషాలు ఛేజ్ చేసి పట్టుకున్నారు. ఈ ఘటన మెదక్ జిల్లా టేక్మాల్లో మంగళవారం జరిగింది. ఎస్సై లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం తెలుసుకున్న స్థానికులు పోలీస్స్టేషన్ కు చేరుకొని పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. హార్వెస్టర్ కు సంబంధించిన బ్యాటరీ, స్పేర్ పార్ట్స్ దొంగిలించిన కేసును కాంప్రమైజ్ చేసేందుకు ఓ రైతు వద్ద టేక్మాల్ ఎస్సై రాజేశ్ రూ.40 వేలు డిమాండ్ చేశాడు. ఈ నెల 5న రూ.10 వేలు వేరే వ్యక్తికి ఫోన్ పే చేయించుకున్నాడు. మిగిలిన రూ.30 వేలు ఇస్తేనే పని పూర్తవుతుందని తెలిపాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మంగళవారం పోలీస్స్టేషన్లో ఎస్సైకి రూ.30 వేలు ఇచ్చాడు. అదే సమయంలో ఏసీబీ అధికారులు స్టేషన్లోకి రావడంతో, వారిని గమనించిన ఎస్సై పోలీస్స్టేషన్ బిల్డింగ్ పైకి ఎక్కి అక్కడి నుంచి కిటికీ సజ్జ మీదకు దూకాడు. అక్కడి నుంచి కిందకు దూకి పొలాల్లోకి పరుగు తీశాడు. దీంతో ఏసీబీ అధికారులు అతడిని 20 నిమిషాల పాటు ఛేజ్ చేసి పట్టుకున్నారు. అనంతరం ఎస్సైని పోలీస్స్టేషన్ కు తీసుకువచ్చి కెమికల్ టెస్ట్ చేశారు. ఎస్సైని కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మండలకేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు స్టేషన్ కు చేరుకొని పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఎస్సై రాజేశ్అవినీతిపై డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.
రూ.లక్ష తీసుకుంటూ పట్టుబడిన సికింద్రాబాద్ సర్వేయర్, చైన్మన్
పద్మారావునగర్: రూ. లక్ష లంచం తీసుకుంటూ సికింద్రాబాద్ తహసీల్దార్ ఆఫీస్లో పని చేసే సర్వేయర్, చైన్మన్ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. కిమ్స్ హాస్పిటల్ రోడ్ లో బాధితుడు కొంత భూమిని లీజుకు తీసుకొని హోటల్ నడిపిస్తున్నాడు. ఆ భూమి పార్కుకు చెందిందని, భూ సర్వేలో రిపోర్ట్ మార్చడానికి సర్వేయర్ కలువ కిరణ్ కుమార్ బాధితుడిని రూ.3 లక్షలు లంచం డిమాండ్ చేశాడు.
బాధితుడు రూ.2లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకొని ఏసీబీని ఆశ్రయించాడు. మంగళవారం రూ. లక్ష ఇవ్వడానికి సికింద్రాబాద్ తహసీల్దార్ ఆఫీస్ కు రాగా, పార్కింగ్ లోని 999 నెంబర్ ఇన్నోవా కారులో డబ్బులు పెట్టమని సర్వేయర్ సూచించాడు. నిజామాబాద్ లో నివాసం ఉండే కిరణ్ ఇంటికి వెళ్లేందుకు బోయిన్పల్లి బస్టాప్ వద్ద ఎదురు చూస్తూ.. కారులో ఉన్న డబ్బులు చైన్ మన్ భాస్కర్ ద్వారా తెప్పించుకున్నాడు. అప్పటికే కాపు కాసి ఉన్న ఏసీబీ అధికారులు బోయిన్పల్లి వద్ద ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని, వారి వద్ద ఉన్న రూ.లక్ష స్వాధీనం చేసుకున్నారు.
సికింద్రాబాద్ తహసీల్దార్ ఆఫీస్తో పాటు నిజామాబాద్ లోని సర్వేయర్ కిరణ్ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. వారిని నాంపల్లి ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
గోపాల్పేటలో విద్యుత్ ఏఈ..
గోపాల్ పేట: వనపర్తి జిల్లా గోపాల్ పేట విద్యుత్ శాఖ ఏఈ రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గోపాల్పేట మండలం ఏదుల గ్రామానికి చెందిన ఓ రైతు ట్రాన్స్ఫార్మర్ మంజూరు కోసం ఏఈ హర్షవర్ధన్ ను సంప్రదించగా, రూ.50 వేలు డిమాండ్ చేశాడు.
అంత ఇవ్వలేనని చెప్పగా, రూ.40 వేలు ఇవ్వాలని ముందుగా రూ.20 వేలు, ట్రాన్స్ఫార్మర్ వచ్చాక రూ.20 వేలు ఇవ్వాలని చెప్పాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించి, వారి సూచనల మేరకు మంగళవారం మధ్యాహ్నం ఏఈ హర్షవర్ధన్ కు రూ.20 వేలు లంచం ఇచ్చాడు. వెంటనే ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏఈని నాంపల్లి కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.
