ములకలపల్లి, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం జీపీవో బాణావత్ శ్రీనివాస్ నాయక్ సోమవారం ఓ రైతు నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ వై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఒడ్డు రామవరం గ్రామానికి చెందిన భూక్య ధర్మ తన కూతురు భూక్య శిరీష కోసం, వేముకుంట గ్రామానికి చెందిన గంగవరపు సుధాకర్ వద్ద ఏడాది కింద రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు.
ఆ భూమిని పట్టా చేయించేందుకు జీపీవో శ్రీనివాస్ నాయక్ ను సంప్రదించాడు. రూ.60 వేలు లంచం డిమాండ్ చేయగా, రూ 55 వేలకు ఒప్పందం చేసుకొని రూ.30 వేలు ఫోన్ పే ద్వారా, రూ.10 వేల నగదు ఇచ్చి స్లాట్ బుక్ చేసుకున్నాడు. మిగిలిన రూ.15 వేలు పట్టా చేసే సమయంలో చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాడు.
అనంతరం బాధితుడు ధర్మ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారి సూచనల మేరకు తహసీల్దార్ ఆఫీస్ లో జీపీవోకు రూ.15 వేలు ఇచ్చాడు. వెంటనే ఏసీబీ అధికారులు జీపీవో శ్రీనివాస్నాయక్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో తహసీల్దార్ హస్తం ఉందా? అనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
