బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా.. ఫైనల్‌లో పాకిస్తాన్‌తో ఢీ

బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా.. ఫైనల్‌లో పాకిస్తాన్‌తో ఢీ

ఏసీసీ ఎమర్జింగ్‌ ఆసియా కప్‌-2023లో భారత యువ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. కొలంబో వేదికగా శుక్రవారం బంగ్లాదేశ్‌‌తో జరిగిన సెమీ ఫైనల్ పోరులో భారత ఏ జట్టు 51 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 211 పరుగులు మాత్రమే చేసినప్పటికీ.. బంగ్లాను 160 పరుగులకే కట్టడి చేశారు. దీంతో టీమిండియా తుది పోరుకు అర్హత సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసినభారత ఏ జట్టు 49.1 ఓవర్లలో 211 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. యశ్‌ ధుల్‌ (66) మినహా ఏ ఒక్కరు రాణించలేకపోయారు. గత మ్యాచ్‌లో అజేయ సెంచరీతో మెరిసిన సాయి సుదర్శన్‌ 21 పరుగులకే పెవిలియన్‌ చేరగా.. మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ 34 పరుగులతో పర్వాలేదనిపించారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం భారత్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టింది. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్‌, తంజీ హసన్‌ షకీబ్‌, రకీబుల్‌ హసన్‌ రెండేసి వికెట్లు తీయగా.. రిపన్‌ మొండాల్‌, కెప్టెన్‌ సైఫ్‌ హసన్‌, సౌమ్యా సర్కార్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని బంగ్లా బ్యాటర్లు చేధించలేకపోయారు. నిశాంత్ సందు 5, మానవ్ సుతార్ 3 వికెట్లతో చెలరేగడంతో 34.2 ఓవర్లలో 160 పరుగులకే కుప్పకూలింది. మొదటి వికెట్‌కు మహమ్మదా నయీమ్(38), తంజీద్ హసన్(51) 70 పరుగుల భాగస్వామ్యం అందించనప్పటికీ.. వీరిద్దరూ ఔట్ అయ్యాక బంగ్లా కోలుకోలేక పోయింది.

జూలై 23న ఫైనల్

ఇక తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అతిథ్య శ్రీలంకను 60 పరుగులు తేడాతో చిత్తు చేసిన పాకిస్తాన్‌ తుది పోరుకు అర్హత సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 323 పరుగుల భారీ స్కోర్ చేయగా.. శ్రీలంక 45.4 ఓవర్లలో 262 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ - పాకిస్తాన్ మధ్య ఫైనల్ పోరు జరగనుంది. 

ఇక లీగ్ దశలో పాకిస్తాన్‌- ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత ఏ జట్టు 8 వికెట్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.