
హైదరాబాద్, వెలుగు: సివిల్స్ లో వికలాంగుల రిజర్వేషన్లపై ట్వీట్లు చేసి వివాదంలో చిక్కుకున్న సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ మంగళవారం మరో ట్వీట్ చేశారు. ఐఏఎస్ కోచింగ్ నిర్వాహకురాలు బాలలత చాలెంజ్ ను తాను స్వీకరిస్తున్నానని తెలిపారు. అయితే, ఇపుడు సివిల్స్ రాయడానికి తనకు ఏజ్ లేదని, యూపీఎస్సీ రూల్స్ ఒప్పుకోవని ఆమె ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.
తనతో సివిల్స్ రాయాలని స్మితకు బాలలత సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఇక వికలాంగుల రిజర్వేషన్ ను ప్రజల కోసం ఉపయోగించారా? లేదా సివిల్స్ కోచింగ్ ఇన్ స్టిట్యూట్ నడపడానికా? అని బాలలతను ఆమె ప్రశ్నించారు. తన ప్రశ్నలకు బాలలత సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.