- 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ దిగొచ్చిన ధరలు
- కేంద్రం సూచనతో వ్యాట్ తగ్గించిన రాష్ట్రాలు
- తెలంగాణ మాత్రం ససేమిరా.. పెట్రోల్ రూ.108.20
- దేశంలో ఎక్కువ రేట్లలో నాలుగో స్థానంలో రాష్ట్రం
న్యూఢిల్లీ: కేంద్రం పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.10 ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంతో.. 17 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా వ్యాట్ను తగ్గించాయి. తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాలు మాత్రం వ్యాట్ను తగ్గించలేదు. వ్యాట్ను తగ్గించుకోవడంతో చాలా రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ వంద రూపాయల కన్నా తక్కువకే వస్తోంది. మన రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ధర రూ.108.20 ఉంటే.. మన పక్కనే ఉన్న కర్నాటకలో 100.14 ఉంది. పెట్రోల్ రేట్లు ఎక్కువున్న రాష్ట్రాల జాబితాలో మన రాష్ట్రం నాలుగో స్థానంలో ఉంది. దీంతో రాష్ట్ర ప్రజలకు కేవలం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు ద్వారా మాత్రమే ఊరట కలిగింది. సీఎం కేసీఆర్ మాత్రం పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను తగ్గించబోమని స్పష్టం చేశారు. అత్యధికంగా రాజస్థాన్లో లీటర్ పెట్రోల్పై రూ.111.10 వసూలు చేస్తుండగా.. ఆ తర్వాత ఏపీలో110.71గా ధర ఉంది. మహారాష్ట్రలో పెట్రోల్ 110.33గా ఉంది. డీజిల్పై ఎక్కువ ధరలున్న రాష్ట్రాల జాబితాలో మన రాష్ట్రం రెండో స్థానంలో (లీటర్కు రూ.94.62) ఉండగా.. మనకన్నా ముందు రాజస్థాన్ ఉంది. అక్కడ లీటర్ డీజిల్ ధర రూ.95.71గా ఉంది.
బీజేపీ, దాని మిత్రపక్షాలున్న రాష్ట్రాల్లోనే పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను ఎక్కువగా తగ్గించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పంజాబ్ కాస్త ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నా.. పెట్రోల్పై రూ.10, డీజిల్పై రూ.5 తగ్గించింది. దీంతో ఆ రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ రూ.95.50కు దిగొచ్చింది. ఇటు డీజిల్ ధర రూ.83.02కి తగ్గింది. అయితే, 12 రాష్ట్రాలు మాత్రం వ్యాట్ను తగ్గించలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిశా, చత్తీస్గఢ్, ఢిల్లీ, తమిళనాడు, కేరళ, మేఘాలయ, జార్ఖండ్లు వ్యాట్ తగ్గించలే. కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ కూడా దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన దగ్గర్నుంచి.. రోజువారీ పెట్రోల్ ధరలు పెరగలేదు. ఏపీ అయితే ఎందుకు తగ్గించట్లేదో ప్రకటన రూపంలో వివరణ ఇచ్చింది.