మైనర్ బాలికపై అత్యాచారం నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

మైనర్ బాలికపై అత్యాచారం నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
  • 3 నెలల్లోనే  విచారణ పూర్తి
  • నాంపల్లి ప్రత్యేక పోక్సో కోర్టు సంచలన తీర్పు

హైదరాబాద్: అన్నెం పున్నెం ఎరుగని ఐదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి నాంపల్లి ప్రత్యేక కోర్టు పోక్సో చట్టం కింద 20 యేండ్ల జైలు శిక్ష మరో పదివేల రూపాయల జరిమానా విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. నిందితుడు జరిమానా చెల్లించకపోతే మరో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాలని కోర్టు స్పష్టం చేసింది. కేసు విచారణను కేవలం మూడు నెలల్లోనే విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించింది. సంచలనం సృష్టించిన కేసు వివరాలు మంగళహాట్  పోలీసుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. గత ఏడాది అక్టోబర్ 8వ తేదీన బాలిక తల్లి గుడియా యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వారి సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ నుండి బ్రతుకు దెరువు కోసం భర్త అజయ్ కుమార్ యాదవ్ తో హైదరాబాద్ వచ్చారు. మంగల్ హాట్ లో వీళ్లు ఉండే శివలాల్ నగర్ కు  ధూల్ పేట్ కాలనీలో ఉండే శుక్రత్ సింగ్ ఊకె అనే వ్యక్తి 2020 అక్టోబర్ 7వ తేదీన ఐదేళ్ల పాపను తన గదికి తీసుకెళ్లి 5 రూపాయలు ఇచ్చి పాప బట్టలు విప్పి కర్కశంగా  చేసాడని పాప ఏడుస్తూ తల్లికి చెప్పింది. దీంతో చిన్నారి బాలికను తీసుకుని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న మంగళహాట్ పోలీసులు నిందితుడిపై పోక్సో ( pocso) చట్టం కింద 255/2020 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అనంతరం కోర్టులో  చార్జ్ షీట్ దాఖలు చేశారు. కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుర్గాజి బాలిక తరుపున వాదనలు వినిపించారు. సుదీర్ఘంగా సాగిన కేసు విచారణలో అందరు సాక్షులను విచారించిన నాంపల్లి ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి కుంచల సునీత నేరం రుజువైందని, దీంతో నిందితుడికి ఇరవై యేండ్ల జైలు శిక్ష, రూ. పదివేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఒకవేళ నిందితుడు రూ. పదివేల జరిమానా కట్టకపోతే మరో ఆరునెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొన్నారు. ఆదే విధంగా నిందితుడు అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు.