
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని వికారాబాద్ డిస్ట్రిక్ట్ డెవలప్ మెంట్ ఫోరం(వీడీడీఎఫ్ ) సభ్యులు తీర్మానించారు. ఆదివారం (జూన్ 29) జిల్లా కేంద్రంలోని సంకల్ప విద్యాపీఠం ఆడిటోరియంలో జిల్లా అభివృద్ధిపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడారు.
మన్నెగూడ వరకు ఏర్పాటవుతున్న రీజినల్ రింగ్ రోడ్(ఆర్ఆర్ఆర్)కు కనెక్ట్ చేస్తూ వికారాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎన్టీఆర్, బీజేఆర్ చౌరస్తా, ఎంఎస్టీ చౌరస్తాలను విస్తరించి, సిగ్నల్ వ్యవస్థను పునరుద్ధరించాలని కోరారు. ఫోరం వ్యవస్థాపక సభ్యుడు, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ.. నిత్యం ప్రమాదాలకు కారణమవుతున్న పోలీస్ అకాడమీ- మన్నెగూడ జాతీయ రహదారి( ఎన్ హెచ్–163) పనులను పూర్తి చేయాలన్నారు.
ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు వెంకటరత్నం, శ్రీశైలం మాట్లాడుతూ.. వికారాబాద్లో గ్రామీణ విశ్వవిద్యాలయం, కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలన్నారు. న్యాయవాదులు అశోక్, ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ.. పాలమూరు-–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను జిల్లాలో త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ లెక్చరర్స్ఫోరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తిరుపతి రెడ్డి, మహేశ్, ప్రైవేట్ విద్యాసంస్థల ప్రతినిధులు సుధాకర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఉద్యోగ సంఘాల తరఫున ఆకుల నందకుమార్, మహిళా సంఘాల తరఫున గీత, జర్నలిస్టుల తరఫున షఫీ, రాంచందర్ పాల్గొన్నారు.