
ఇంటింటికీ వెళ్లి అందజేసిన వాలంటీర్లు.. ముమ్మరంగా తనిఖీ చేసిన అధికారులు
విజయవాడ: ఏపీలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగింది. 60 ఏళ్లు దాటిన వృధ్దులు, అంగ వికలురు, మానసిక వికలాంగులతోపాటు.. గత నెల నుండి 45 ఏళ్లు పైబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు చెందిన ఒంటరి మహిళలకు వైఎస్ఆర్ కానుకల పేరుతో పెన్షన్లు ఇస్తున్నారు. ప్రతి నెల ఒకటో తేదీన వాలంటీర్లు లబ్దిదారుల ఇళ్లకు ఉదయమే వెళ్లి చిరు నవ్వుతో పలుకరించి ఇవ్వాలన్న సీఎం ఆదేశాల మేరకు తొలి రోజు 90 శాతం పంపిణీ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఉదయం ఎవరైనా అందుబాటులో ఉండకపోతే.. కనీసం సాయంత్రం లేదా.. మరుసటి రోజైనా ఇవ్వాలని అధికారులు వాలంటీర్లకు ఆదేశాలిచ్చారు. పంపిణీ ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు ఉన్నతాధికారులందరూ తమ పరిధిలోని వార్డులకు వెళ్లి పర్యవేక్షించారు. వాలంటీర్ల పనితీరు గురించి ఆరా తీశారు. ఇతర సమస్యలు ప్రస్తావించిన వారిని గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో వెళ్లి ఆన్ లైన్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు.