మోడీ ప్రధానిగా ఉండటం ఈ దేశ ప్రజల అదృష్టం

మోడీ ప్రధానిగా ఉండటం ఈ దేశ ప్రజల అదృష్టం

కరోనా వైరస్ నియంత్రణకు భారత ప్రజలంతా కలసికట్టుగా పోరాటం చేయాలన్నారు  బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్. అందరూ సెల్ఫ్ క్వారంటైన్ పాటించినప్పుడే ఈ పోరాటంలో మనం విజయం సాధిస్తామన్నారు. కరీంనగర్ జ్యోతి నగర్ లోని తన నివాసంలో జరిగిన నమో జ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు సంజయ్. దీపాలు వెలిగించి ప్రధాని మోడీకి దన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.

కరోనా పై పోరాటంలో కార్యకర్తలు మోడీకి అండగా నిలవాలన్నారు ఎంపీ బండి సంజయ్. ప్రపంచ యుద్ధ సమయంలో కూడా ప్రజలను ఈ విధంగా ఏ నాయకుడు ఆదుకోలేదన్నారు. ఇలాంటి విపత్తు సమయంలో మోడీ మన దేశ ప్రధానిగా ఉండడం ఈ దేశ ప్రజల అదృష్టమన్నారు. కరోనా పై యుద్ధంలో మోడీ దేశానికి కొండంత అండ అని అన్నారు.

అంతే కాదు ప్రధాని ప్రకటించిన ప్యాకేజీతో రాష్ట్రంలో 59లక్షల మంది జాబ్ కార్డులన్న ఉపాధి హామీ కూలీలకు, ఉజ్వల గ్యాస్ పొందిన 9.36 లక్షల కుటుంబాలకు, 45 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళల కు, 5.5లక్షల మంది ప్రైవేట్ ఉద్యోగస్తులకు, 50లక్షల మందిరైతులకు లబ్ది చేకూరుతోందన్నారు. ఇది పేద ప్రజలకు ఒక గొప్ప భరోసా ఇస్తుందన్నారు. ఇవి సరిగా లబ్ధిదారులకు అందేలా కార్యకర్తలు చర్యలు తీసుకోవాలన్నారు. బీజేపీ అంటేనే సేవ అనే రీతిలో సేవా కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. ప్రజలు కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఒకరికి ఒకరు అండగా నిలవాలన్నారు.

కరోనా పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు బండి సంజయ్. అయితే రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి కాబట్టి నిర్లక్ష్యం కూడా పనికి రాదని అన్నారు. ప్రభుత్వం అందించే సూచనలు తప్పకుండా పాటించడం మన బాధ్యతగా ప్రతి ఒక్కరు గుర్తించాలి అని కోరారు. ప్రతి ఒక్కరూ ఇంటికి పరిమితం కావాలని కోరారు. సామాజిక దూరం, స్వీయ నియంత్రణ ద్వారానే కరోనాను ఎదుర్కోగలుగుతామని తెలిపారు. ఈ విపత్తును ఎదుర్కోవడంలో ప్రభుత్వానికి, అధికారులకు ఎలాంటి సహకారం కావాలన్నా అందించటానికి తమ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారంటూ స్పష్టం చేశారు ఎంపీ బండి సంజయ్.