
‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మాళవిక నాయర్.. డిఫరెంట్ కాన్సెప్టు చిత్రాల్లో నటిస్తూ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును అందుకుంది. తాజాగా ‘అన్నీ మంచి శకునములే’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సంతోష్ శోభన్ హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో ప్రియాంక దత్ నిర్మించిన ఈ మూవీ మే 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మాళవిక మాట్లాడుతూ ‘ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలన్నీ సాఫ్ట్గా ఉంటాయి. కానీ ఇందులో మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ధైర్యం, కోపం స్పష్టంగా ప్రదర్శించే పాత్ర.
కూనూర్ హిల్ స్టేషన్లో మేజర్ పార్ట్ షూట్ చేశాం. దాదాపు నెల రోజులు అక్కడే ఉన్నాం. సంతోష్, నేను ఫ్రెండ్స్లా వర్క్ చేశాం. రాజేంద్ర ప్రసాద్, గౌతమి, నరేష్, వాసుకి.. ఇలా ఎక్స్పీరియెన్స్ ఉన్న నటీనటులతో కలిసి నటించడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్తోపాటు హ్యూమర్ కూడా ఉంది. నందినితో మళ్లీ మళ్లీ వర్క్ చేయాలనుంది. వైజయంతి మూవీస్లో నటించడం అదృష్టంగా భావిస్తా. ప్రతి సినిమాలోనూ నా పాత్రలో కొత్తదనం ఉండేలా చూసుకుంటాను. యాక్టింగ్ నా కంట్రోల్ ఉంటుంది. కథలు, ఫిల్మ్ మేకర్స్ని ఎంచుకోవడం నా చేతుల్లో ఉంటుంది. కానీ కొన్ని సార్లు వర్క్ అవుట్ కాకపోవచ్చు. వాటిని పర్సనల్గా తీసుకోను. యాక్షన్ సినిమా చేయాలనే కోరిక ఉంది. కళ్యాణ్ రామ్ ‘డెవిల్’లో ఆసక్తికరమైన పాత్ర చేస్తున్నా’ అని చెప్పింది.