- రానున్న ఐదేళ్లలో ఖర్చు చేస్తాం
- ప్రైవేటీకరణ రౌండ్లో అన్ని ఎయిర్పోర్టులకు బిడ్స్ వేస్తాం: జీత్ అదానీ
ముంబై: ఎయిర్పోర్ట్ బిజినెస్లో రానున్న ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని అదానీ గ్రూప్ ప్రకటించింది. భారత ఏవియేషన్ సెక్టార్ ఏడాదికి 15–16శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేసింది. “మేము ఏవియేషన్ సెక్టార్పై కాన్ఫిడెంట్గా ఉన్నాం. వచ్చే రౌండ్ ప్రైవేటీకరణలో అన్ని 11 విమానాశ్రయాల బిడ్డింగ్లో దూకుడుగా పాల్గొంటాం” అని అదానీ ఎయిర్పోర్ట్స్ డైరెక్టర్, గౌతమ్ అదానీ చిన్న కొడుకు జీత్ అదానీ తెలిపారు.
భారత ఏవియేషన్ సెక్టార్ వచ్చే 10–-15 సంవత్సరాలు మధ్యస్థ వృద్ధి రేటుతో కొనసాగుతుందని, చైనా స్థాయికి చేరుకోవాలంటే, అనేక నగరాల్లో ఈ సెక్టార్ విస్తరించాలని వివరించారు. నవీ ముంబై ఎయిర్పోర్ట్ ప్రారంభం భారత విమానయాన రంగానికి ల్యాండ్మార్క్ మూమెంట్గా నిలుస్తుందని పేర్కొన్నారు. అదానీ గ్రూప్కు చెందిన నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ నెల 25న వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే.
మొదటి దశలో 2 కోట్ల ప్రయాణికులకు సేవలందించేలా దీనిని తీర్చిదిద్దారు. రానున్న కాలంలో ఈ కెపాసిటీని 9 కోట్ల ప్రయాణికులకు పెంచనున్నారు. ఈ ఎయిర్పోర్ట్ను రూ.19,650 కోట్ల పెట్టుబడితో నిర్మించారు. దీంతో ముంబైలోని ప్రస్తుత విమానాశ్రయంపై ఒత్తిడి తగ్గుతుందని అంచనా.
ప్రయాణికులు, కార్గోలో అదానీ టాప్
అదానీ గ్రూప్ ఇప్పటికే ముంబై, అహ్మదాబాద్, లక్నో, గువాహటి, తిరువనంతపురం, జైపూర్, మంగళూరు విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. 2019లో ప్రైవేటీకరణలో ఆరు విమానాశ్రయాలను గెలుచుకున్న ఈ కంపెనీ, 2021లో జీవీకే గ్రూప్ నుంచి ముంబై ఎయిర్పోర్ట్ను కొనుగోలు చేసింది.
అదానీ ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఏఏహెచ్ఎల్) ప్రస్తుతం దేశవ్యాప్తంగా 23శాతం మంది ప్రయాణికుల రాకపోకలు, 33శాతం కార్గో ట్రాఫిక్ను నిర్వహిస్తూ, భారతదేశంలో అతిపెద్ద విమానాశ్రయ ఆపరేటర్గా ఉంది. ఏఏహెచ్ఎల్ ప్రస్తుత సౌకర్యాల విస్తరణ, రిటైల్, సిటీ-సైడ్ డెవలప్మెంట్లలో పెట్టుబడులు పెడుతోంది.
