న్యూఢిల్లీ: అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ మంగళవారం (నవంబర్ 25) భారతదేశంలో అతిపెద్ద రైట్స్ ఇష్యూను ప్రారంభించింది. కంపెనీ షేర్లను రూ. 1,800 చొప్పున అందిస్తోంది. ఇది అప్రూవల్ తేదీ ధర కంటే దాదాపు 24 శాతం తక్కువ. మొత్తం 13.85 కోట్ల కొత్త షేర్లను జారీ చేయడం ద్వారా రూ. 24,930.30 కోట్లు సేకరిస్తుంది.
ఇది వచ్చే నెల 10న ముగుస్తుంది. ప్రస్తుతం ఉన్న ప్రతి 25 ఈక్విటీ షేర్లకు , మూడు రైట్స్ ఈక్విటీ షేర్ల చొప్పున ఇస్తారు. ప్రమోటర్లు తమ వాటాను సబ్స్క్రయిబ్ చేస్తామని ప్రకటించారు. ఇష్యూ ద్వారా వచ్చే నిధులను ఎయిర్పోర్టులు, డేటా సెంటర్లు, గ్రీన్ హైడ్రోజన్, రోడ్లు వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు, అప్పులను తీర్చడానికి ఉపయోగిస్తారు. దరఖాస్తు సమయంలో పెట్టుబడిదారులు ఒక్కో షేర్కు రూ. 900 చెల్లించాలి.
