- హిండెన్బర్గ్పై అదానీ ఫైర్
ముంబై : అదానీ గ్రూప్పై యూఎస్ కంపెనీ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలు కేవలం కంపెనీని నష్టపరచడానికే కాదని, రాజకీయంగా ప్రభుత్వ విధానాలను నిందించడానికని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ అన్నారు. అదానీ గ్రూప్ అకౌంటింగ్ ఫ్రాడ్స్కు పాల్పడిందని, షేర్లను మానిప్యులేట్ చేసిందని కిందటేడాది జనవరిలో హిండెన్బర్గ్ రిపోర్ట్ విడుదల చేసింది. ఈ ఆరోపణలపై అదానీ గ్రూప్కు ఈ ఏడాది సుప్రీం కోర్టులో ఊరట లభించింది. అదనపు దర్యాప్తు అవసరం లేదని కోర్టు తీర్పిచ్చింది.
హిండెన్బర్గ్ రిపోర్ట్ కారణంగా అదానీ కంపెనీలు ఏకంగా 150 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 12.4 లక్షల కోట్లు) నష్టపోయాయి. కిందటేడాది ప్రారంభంలో గ్లోబల్ రిచ్లిస్ట్లో మూడో ప్లేస్ను టచ్ చేసిన గౌతమ్ అదానీ, హిండెన్బర్గ్ రిపోర్ట్ దెబ్బకు టాప్ 20 నుంచి వైదొలిగారు. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఇప్పటికీ హిండెన్బర్గ్ నష్టాల నుంచి పూర్తిగా రికవరీ కాలేదు. తమ ఫౌండేషన్ను కూల్చాలని చూసినా, స్ట్రాంగ్గా నిలబడ్డామని ముంబైలో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్లో గౌతమ్ అదానీ పేర్కొన్నారు. కేవలం తమ పరువును నిలబెట్టుకోవడమే కాకుండా
బిజినెస్ను యథావిధిగా కొనసాగించామని పేర్కొన్నారు. ‘వ్యాపారం అంటే రిస్క్లు తీసుకోవడమే. కొన్నిసార్లు దారి తప్పుతాం. కొన్నిసార్లు పడిపోతాం. కానీ, ప్రతి సారి దారి తప్పినా, పడినా, తిరిగి నా దారిని వెతుక్కోగలిగాను. తిరిగి లేచి నిలబడగలిగాను’ అని గౌతమ్ అదానీ పేర్కొన్నారు. ఎంత సక్సెస్ సాధిస్తే, అంత పెద్ద టార్గెట్గా మారతామని ఆయన అన్నారు. విమర్శలను ఎదుర్కొని నిలబడగలిగే దమ్ము ఉండాలన్నారు. సక్సెస్ సాధించినా, మానవ విలువలను మరిచిపోకూడదని అదానీ సలహా ఇచ్చారు.