
- ఏడాది కాలంలో 3.55 బిలియన్ డాలర్ల నుంచి 6.46 బిలియన్ డాలర్లకు
- అత్యంత వేగంగా విలువ పెరిగిన బ్రాండ్లలో నెంబర్ వన్
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్గా నిలిచిందని, ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఫోకస్ పెడుతూ ఈ గ్రూప్ దూసుకుపోతోందని కన్సల్టెన్సీ కంపెనీ బ్రాండ్ ఫైనాన్స్ ఓ రిపోర్ట్లో పేర్కొంది. అదానీ బ్రాండ్ వాల్యూ 2024లో 3.55 బిలియన్ డాలర్లు (రూ.31 వేల కోట్లు) ఉండగా, ఈ ఏడాది 6.46 బిలియన్ డాలర్ల (రూ.56 వేల కోట్ల) కు పెరిగింది. ఇది 2.91 బిలియన్ డాలర్ల (రూ.25 వేల కోట్ల) పెరుగుదల.
2023లోని కంపెనీ బ్రాండ్ వాల్యూ కంటే ఇది ఎక్కువ. బ్రాండ్ ఫైనాన్స్ విడుదల చేసిన ‘ఇండియాలోని అత్యంత విలువైన బ్రాండ్లు–2025’లో అదానీ గ్రూప్ 13వ ర్యాంక్ దక్కించుకుంది. కిందటేడాది రిపోర్ట్లో 16 వ ర్యాంక్ పొందింది. అదానీ గ్రూప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ ఎనర్జీపై ఫుల్గా ఫోకస్ పెట్టింది. దీంతో గ్రూప్ బ్రాండ్ వాల్యూ ఏడాది కాలంలో 82శాతం పెరిగింది. కన్స్యూమర్లలో బ్రాండ్కు ఉన్న పాపులారిటీ, రాయల్టీ రేట్ ద్వారా బ్రాండ్ ఇంపాక్ట్, రెవెన్యూ అంచనాలు వంటి అంశాల ఆధారంగా బ్రాండ్ ఫైనాన్స్ ఈ ర్యాంకులను ఇచ్చింది.
ఇతర కంపెనీలు..
తాజా రిపోర్ట్ ప్రకారం, ఇండియాలోని టాప్ 100 బ్రాండ్స్ మొత్తం విలువ 236.5 బిలియన్ డాలర్లు (రూ.20 లక్షల కోట్లు) గా ఉంది. టాటా గ్రూప్ 31.6 బిలియన్ డాలర్ల (రూ.2.71 లక్షల కోట్ల) (10శాతం పెరుగుదల)తో భారతదేశంలో అత్యంత విలువైన బ్రాండ్గా నిలిచింది. ఎలక్ట్రానిక్స్, ఈవీలు, సెమీకండక్టర్స్, ఏఐ, రెన్యూవబుల్స్లో కంపెనీ పెట్టుబడులు ఇందుకు దోహదం చేశాయి. 16.3 బిలియన్ డాలర్ల (రూ.1.40 లక్షల కోట్ల) బ్రాండ్ వాల్యూ (15శాతం పెరుగుదల)తో ఇన్ఫోసిస్ రెండో స్థానంలో నిలిచింది. ఐటీ సర్వీసెస్ సెక్టార్లో లీడర్గా ఉంది.
హెచ్డీఎఫ్సీ గ్రూప్ 14.2 బిలియన్ డాలర్లు (37శాతం పెరుగుదల)తో మూడో స్థానంలో, ఎల్ఐసీ 13.6 బిలియన్ డాలర్లతో (35శాతం పెరుగుదల)తో నాలుగో స్థానంలో, 8.9 బిలియన్ డాలర్లతో (17శాతం పెరుగుదల)తో హెచ్సీఎల్ టెక్ ఎనిమిదో స్థానంలో ఉన్నాయి.
లార్సెన్ అండ్ టూబ్రో(7.4 బిలియన్ డాలర్లు) తొమ్మిదో స్థానంలో, మహీంద్రా గ్రూప్(7.2 బిలియన్ డాలర్ల) తో పదో స్థానంలో ఉన్నాయి. అత్యంత బలమైన బ్రాండ్లలో తాజ్ హోటల్స్ వరుసగా నాలుగో ఏడాది కూడా టాప్లో కొనసాగుతోంది. ఏషియన్ పెయింట్స్ రెండో ప్లేస్లో, అమూల్ మూడో ప్లేస్లో ఉన్నాయని బ్రాండ్ ఫైనాన్స్ రిపోర్ట్ పేర్కొంది.