- ఇది భారత్లోనే అతిపెద్దదని ప్రకటన
- కెపాసిటీ 1,126 మెగావాట్లు
- వచ్చే ఏడాది ప్రారంభం
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ రంగంలోకి అడుగుపెట్టింది. గుజరాత్లోని ఖావ్దాలో 1,126 మెగావాట్ల/3,530 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్) ఏర్పాటు చేయనున్నట్లు మంగళవారం ప్రకటించింది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టోరేజ్ ప్రాజెక్టుల్లో ఇదీ ఒకటని పేర్కొంది. 700కు పైగా బీఈఎస్ఎస్ కంటైనర్లతో కూడిన ఈ సదుపాయం వచ్చే మార్చి నాటికి అందుబాటులోకి వస్తుంది. ఖావ్దా ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద క్లీన్ఎనర్జీ ప్లాంట్ అవుతుందని అదానీ వర్గాలు తెలిపాయి. అయితే పెట్టుబడి వివరాలను మాత్రం వెల్లడించలేదు.
క్లీన్ఎనర్జీ వాడకాన్ని పెంచడానికి, బ్యాకప్ విద్యుత్ అందించడానికి, గ్రిడ్ స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి బ్యాటరీ స్టోరేజ్కీలకం. సౌర, పవన శక్తిలాంటి వనరుల నుంచి ఉత్పత్తి అయిన కరెంటును నిల్వ చేసి, ఆ వనరులు అందుబాటులో లేనప్పుడు (రాత్రి లేదా తక్కువ గాలి వీచినప్పుడు) ఉపయోగించుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టు పీక్ లోడ్ ఒత్తిళ్లను, ట్రాన్స్మిషన్ రద్దీని తగ్గిస్తుంది. నిరంతరం క్లీన్ పవర్ను సరఫరా చేయగలుగుతుంది. ప్రాజెక్టు కోసం అధునాతన లిథియం- అయాన్ బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగిస్తారు. బీఈఎస్ఎస్ ప్రాజెక్టుకు 1126 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం, 3,530 మెగావాట్ల శక్తి సామర్థ్యం ఉంటుంది. అంటే, ఇది 3,530 మెగావాట్ల శక్తిని నిల్వ చేయగలదు. గ్రిడ్కు నిరంతరాయంగా 1,126 మెగావాట్ల విద్యుత్ను సరఫరా చేయగలుగుతుంది.
ఎనర్జీ స్టోరేజీ కీలకం..
బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ భవిష్యత్తుకు కీలకమని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ అన్నారు. ఈ చారిత్రక ప్రాజెక్టుతో తాము ప్రపంచ ప్రమాణాలను నిర్దేశించగలుగుతామని, సమర్థవంతమైన, పరిశుభ్రమైన, తక్కువ ధర గల విద్యుత్ను అందిస్తామని ఆయన చెప్పారు. అదానీ గ్రూప్ తన స్టోరేజ్ సామర్థ్యాన్ని 2027 ఆర్థిక సంవత్సరం నాటికి 15 గిగావాట్లకు, ఐదేళ్లలో 50 జీగావాట్లకు పెంచాలని యోచిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా పెద్ద ఎత్తున స్టోరేజ్ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడి పెట్టే గ్లోబల్ ఎనర్జీ లీడర్ల సరసన చేరింది.
