
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ కంపెనీ అదానీ విల్మార్ 2023 మార్చి తో ముగిసిన నాలుగో క్వార్టర్లో నికరలాభం 60 శాతం తగ్గి రూ. 93.6 కోట్లకు పడిపోయింది. కిందటి ఏడాది క్రితం ఇదే క్వార్టర్లో రూ.234.29 కోట్ల నికర లాభాన్ని సంపాదించింది. కార్యకలాపాల ద్వారా దాని ఆదాయం (కన్సాలిడేటెడ్) ఏడు శాతం తగ్గి రూ. 13,872.6 కోట్లుగా ఉంది. కిందటి ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో రూ. 14,917.2 కోట్లు వచ్చాయి.
2023 ఆర్థిక సంవత్సరానికి సంస్థ ఆదాయం రూ. 58,185 కోట్లు కాగా ఉండగా, పన్ను తర్వాత లాభం రూ. 582 కోట్లు ఉంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల అమ్మకాలను సాధించింది. ఆహార విభాగం ఆదాయం రెండు సంవత్సరాలలో రెట్టింపు అయింది. దీని ద్వారా రూ. 4,000 కోట్లు వచ్చాయి. గోధుమ పిండి, బియ్యం వ్యాపారాల ఆదాయం రూ. 1,000 కోట్లు దాటింది. వంట నూనె విభాగం వార్షికంగా 8శాతం పెరిగింది.
గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మంచి పురోగతిని సాధించిందని, ఆహార ఉత్పత్తుల మార్కెట్ వాటాను పెంచుకుందని అదానీ విల్మార్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలిపింది. ఆహార, చమురు ధరల కారణంగా గిరాకీ పెరిగిందని, బేకరీ, ఫ్రైయింగ్ పరిశ్రమ నుండి తక్కువ డిమాండ్ కారణంగా నూనెల అమ్మకాలు తగ్గాయని అదానీ విల్మార్ ఎండీ అంగ్షు మల్లిక్ చెప్పారు.