బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లాంటి వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. ‘‘మతంతో బీజేపీ దేశాన్ని ఏలాలని భావిస్తోంది. హిందుత్వాన్ని బీజేపీకి కట్టబెట్టలేదు. తెలంగాణలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని తెలిపారు. ‘‘ మునావర్ షోకు పర్మిషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కాగా.. ..రెచ్చగొట్టింది బీజేపీ.బండి సంజయ్ పాదయాత్ర కు పర్మిషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కాగా.. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసింది బండి సంజయ్’’ అని దయాకర్ పేర్కొన్నారు.
‘తెలంగాణలో తమ రెండు పార్టీలు మాత్రమే ఉన్నాయని చెప్పేందుకు బీజేపీ, టీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయని అద్దంకి దయాకర్ అన్నారు. ‘‘ఎంఐఎం, టీఆర్ఎస్ ప్రత్యక్ష మిత్రులు కాగా.. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పరోక్ష మిత్రులు’’ అని కామెంట్ చేశారు. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు పదేపదే మతాల ప్రస్తావన తేవడం.. వాటి దివాలాకోరు రాజకీయాలకు నిదర్శనమని’ అన్నారు.