- సూసైడ్ ఘటనను రాజకీయంగా వాడుకుంటున్నరు: ఆది శ్రీనివాస్
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర్ ఘటనను కొందరు రాజకీయంగా వాడుకుంటున్నారని విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. సాయి ఈశ్వర్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాని తెలిపిన ఆయన.. వారిని ఆదుకోవడానికి ప్రయత్నిస్తానని పేర్కొంటూ శనివారం ఓ ప్రకటన రిలీజ్ చేశారు. అయితే, సాయి ఈశ్వర్ సూసైడ్ ఘటనపై కొందరు రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తుండటం దురదృష్టకరమని, దీన్ని బీసీ ఉద్యమానికి లింక్ చేయడం బాధాకరమని ఆది శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
సాయి ఈశ్వర్ ఆత్మహత్య వెనుక నిజమైన కారణాలు వేరే అని ఆయన భార్యే స్వయంగా చెప్పినట్లు వెల్లడించారు. తీన్మార్ మల్లన్న ఇప్పుడు సాయి ఆత్మహత్యను తన రాజకీయ కోసం ఉపయోగించుకునే ప్రయత్నం చేయడం దురదృష్టకరమన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ఎంత చేయాలో అంత చేసిందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి లింక్ చేసి మాట్లాడటం సరైనది కాదని ఆయన పేర్కొన్నారు.
