- మొదటిసారి ఓటేసి మురిసిపోయిన గ్రామస్తులు
ఆదిలాబాద్, వెలుగు: తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో మొదటిసారి సర్పంచ్ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. 65 ఏళ్లుగా ఈ గ్రామంలో సర్పంచ్ ను ఏకగ్రీవంగానే ఎన్నుకుంటున్నారు. ఈసారి బరిలో ఇద్దరు అభ్యర్థులు ఉండడంతో ఎన్నిక అనివార్యమైంది. 1956లో గ్రామపంచాయతీగా ఏర్పడినప్పటి నుంచి బరంపూర్లో గ్రామ పెద్దల తీర్మానంతో సర్పంచ్లను ఏకగ్రీవం చేసుకుంటూ వస్తున్నారు. 20 ఏండ్లు జనరల్, పదేళ్లు ఎస్సీ రిజర్వేషన్లు కల్పించగా గత 35 ఏళ్ల నుంచి ఇక్కడ ఎస్టీ రిజర్వుడ్గా ఉంది. బరంపూర్ పంచాయతీ పరిధిలోకి కొలంగూడ, మదన్ పూర్ గ్రామాలు కూడా వస్తాయి. మొత్తం 10 వార్డులుండగా, 2,300 మంది ఓటర్లు ఉన్నారు. ఈ సారి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మేస్రం దేవురావు, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సిడాం లక్ష్మణ్ రావు బరిలో నిలవగా దేవురావు గెలుపొందారు. మొదటిసారి సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం దక్కడంతో బరంపూర్ గ్రామస్తులు మురిసిపోయారు.
రుయ్యాడంలో వార్డులకే పోలింగ్..
తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామం ఎస్టీకి రిజర్వ్ కాగా, ఇక్కడ ఒక్క ఎస్టీ కుటుంబం కూడా లేకపోవడంతో 19 ఏళ్లుగా కేవలం వార్డు సభ్యులకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. వార్డు సభ్యుల్లోనూ ఐదు వార్డులు మినహా మిగతావి ఎస్టీ రిజర్వుడే. దీంతో ఐదు వార్డుల్లో ఎన్నికలు నిర్వహించి ఉప సర్పంచ్ను ఎన్నుకుంటున్నారు. అందుకే ఇక్కడ కొన్నాళ్లుగా ఉప సర్పంచ్ పాలనే కొనసాగుతోంది.
