ఆర్ఎంపీ వైద్యం కంటే అధ్వానం

ఆర్ఎంపీ వైద్యం కంటే అధ్వానం
  • రిమ్స్ లో  సేవలపై జిల్లా జడ్జి ఆగ్రహం   
  • హైకోర్టుకు ఫిర్యాదు చేస్తామని వెల్లడి

ఆదిలాబాద్‍ అర్బన్‍, వెలుగు: పేద ప్రజలకు అందించే వైద్యసేవలు ఇలాగేనా… ఆర్ఎంపీల కంటే మరీ అధ్వానంగా పరిస్థితి ఉందని  ఆదిలాబాద్​ ఉమ్మడి జిల్లా జడ్జి ఎంజి.ప్రియదర్శిణి ఆగ్రహం వ్యక్తం చేశారు. రిమ్స్ హాస్పిటల్​లో లీగల్‍ ఎయిడ్‍ క్లినిక్‍ను ప్రారంభించేందుకు శనివారం వచ్చిన ఆమె హాస్పిటల్​లో తనిఖీలు నిర్వహించారు. జ్వర పీడితులు, ఆర్థోపెడిక్‍ తదితర వార్డులను పరిశీలించారు. పేషెంట్లతో మాట్లాడి వారికందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఎమర్జెన్సీ ఓపీ విభాగంలో రెగ్యులర్‍ డాక్టర్లకు బదులు జూనియర్‍ డాక్టర్లు ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డాక్టర్ల అటెండెన్సు రిజిస్టర్​ఏదని ప్రశ్నించగా అరగంట ఆలస్యంగా తీసుకువచ్చారు. రిజిస్టర్లు లేకుండా వైద్యమెలా చేస్తున్నారని డాక్టర్లపై మండిపడ్డారు.  అటెండెన్సు రిజిస్టర్‍లో గ్రీన్‍, రెడ్‍, బ్లాక్‍ ఇంకుతో సంతకాలు చేసి ఉండటంపై ఇన్​చార్జి సూపరింటెండెంట్‍ డా.కళ్యాణ్‍రెడ్డిని ప్రశ్నించారు. సంతకాలు ఇప్పుడే చేసినట్లుగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్​లో వైద్యసేవలు అధ్వానంగా ఉన్నాయని, డాక్టర్లు అందుబాటులో లేరని పేర్కొన్నారు. రిమ్స్ వైద్యసేవల్లోని లోపాలపై  హైకోర్టుకు నివేదిక అందజేస్తామని వెల్లడించారు.  ఆమె వెంట డీఎల్‍ఎస్‍ఏ సెక్రటరీ ఉదయ్‍ భాస్కర్‍,  ఆర్ఎంఓ రాము తదితరులున్నారు.