టిడ్కో ఇళ్లపై బహిరంగ చర్చకు సిద్ధం.. టీడీపీకి మంత్రి సవాల్ 

టిడ్కో ఇళ్లపై బహిరంగ చర్చకు సిద్ధం.. టీడీపీకి మంత్రి సవాల్ 

టిడ్కో ఇళ్లపై బహిరంగ చర్చకు తాము సిద్ధమేనని టీడీపీ నేతలకు మంత్రి ఆదిమూలపు సురేష్ సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నెల్లూరులో సెల్ఫీ దిగిన టిడ్కో ఇళ్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాకనే పూర్తి చేశామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. టిడ్కో ఇళ్లపై బహిరంగ చర్చకు మేము సిద్ధం అని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 30 వేల టిడ్కో ఇళ్లను డిసెంబర్ నాటికి లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి ప్రకటించారు.

టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను అసంపూర్తిగా మధ్యలోనే వదిలేసిందని విమర్శించారు. తండ్రి, కొడుకులు టిడ్కో ఇళ్ళ సెల్ఫీలు దిగి అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. తాజ్ మహల్, చార్మినార్ ముందు చంద్రబాబు, లోకేష్‌లు సెల్ఫీలు తీసుకుని మేమే కట్టామని చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. పేదల సంక్షేమం కోసం పోరాడుతోంది ఒక జగన్‌ మాత్రమేనని చెప్పారు. రూపాయికే టిడ్కో ఇళ్లను పేదలకి అందిస్తున్న ఘనత సీఎం జగన్‌ది అని తెలిపారు. టిడ్కో ఇళ్ళ పై టీడీపీ  18,00 కోట్ల రూపాయిల భారాన్ని  వైసీపీ ప్రభుత్వం భరించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా షఫేజ్ 2, ఫేజ్ 3 టిడ్కో ఇళ్లను అన్ని వసతులు కల్పించి లబ్ధిదారులకు డిసెంబర్ నాటికి అందిస్తామని మంత్రి ఆదిమూలపు స్పష్టం చేశారు.


ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెల్ఫీ చాలెంజ్ విసిరారు. గడిచిన నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం కట్టిన ఇళ్లెన్ని? నువ్వు చెప్పిన ఇళ్లెక్కడ? అంటూ నెల్లూరులో టీడీపీ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్ళ సముదాయం వద్ద చంద్రబాబు సెల్ఫీ దిగారు. తమ ప్రభుత్వ హయాంలో పేదలకు ఒక్క నెల్లూరులోనే వేలాది టిడ్కో ఇళ్ళు కట్టామని చెప్పారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం నిర్మించిన లక్షల టిడ్కో ఇళ్లకు సజీవ సాక్ష్యాలు అంటూ అక్కడ సెల్పీ దిగారు.