
డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న చిత్రం ‘భైరవం’. ఇప్పటికే పలు తమిళ చిత్రాలతో ఆకట్టుకోగా, ఈ మూవీతో తెలుగులో పరిచయమవడం డ్రీమ్ కమ్ ట్రూ అంటోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం మే 30న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఇందులో నటించిన హీరోయిన్స్లో ఒకరైన అదితి శంకర్ చెప్పిన విశేషాలు.
‘‘తెలుగులో వర్క్ చేయాలని ఎప్పటినుంచో ఉండేది. ఇలాంటి మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. -మా నాన్నగారితో కలిసి తెలుగు రాష్ట్రాల్లో షూటింగులకి వచ్చేదాన్ని. ఇప్పుడు నా సొంత సినిమాకి ఇక్కడికి వచ్చి షూటింగ్ చేయడం ఒక డ్రీం కం ట్రూ మూమెంట్. ఇందులో అల్లరి పిల్ల వెన్నెల పాత్రలో కనిపిస్తా. ఇది నా ఒరిజినల్ క్యారెక్టర్కి దగ్గరగానే ఉంటుంది. ముగ్గురు హీరోలతో వర్క్ చేయడం వెరీ ఫన్ ఎక్స్పీరియెన్స్. మనోజ్ అన్న నాకు ముందునుంచి తెలుసు. సాయి గారు చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆయనకు జంటగా నేను నటించా.
రోహిత్ గారు కూడా చాలా నైస్ పర్సన్. ఈ ముగ్గురికి తమిళ్ మాట్లాడడం తెలుసు. సో ఈ జర్నీ చాలా కంఫర్టబుల్గా జరిగింది. విజయ్ కనకమేడల క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఆయనకి ఆర్టిస్టుల నుంచి ఎలాంటి పెర్ఫార్మెన్స్ రాబట్టుకోవాలో తెలుసు. ఈ సినిమాలో ప్రతి పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రేక్షకులకు మంచి సినిమా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది.
ఇక మా నాన్న గారి ఇమేజ్ను ఒక గౌరవంగా భావిస్తాను కానీ ఎప్పుడూ ఒత్తిడిగా తీసుకోను. ఆయన డైరెక్షన్లో నటించే చాన్స్ వస్తే తప్పకుండా చేస్తా. -నాకు హిస్టారికల్, పీరియాడిక్ సినిమాలు చేయాలని ఉంది. అలాగే ఛాలెంజింగ్ విమెన్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది’’.