
హైదరాబాద్: భాగ్య నగరంలో కల్తీ బ్యాచ్ ఆగడాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. జులై 2న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన తనిఖీలతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎల్బీ నగర్లో పలు చోట్ల చేసిన తనిఖీల్లో 575 లీటర్ల కల్తీ నెయ్యిని పోలీసులు సీజ్ చేశారు. ఒక్క కల్తీ నెయ్యే కాదు.. మహేశ్వరంలో 3 వేల 946 కేజీల కల్తీ అల్లం పేస్ట్ను, మల్కాజ్ గిరిలో 3వేల 37 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను సీజ్ చేశారు.
భువనగిరిలో 250 కేజీల కల్తీ పన్నీర్ను కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. అంతేకాదు.. పాలు, పసుపు, దనియాల పొడి, స్వీట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీమ్స్, మినరల్ వాటర్, బేకరీ ఐటమ్స్.. ఇలా కాదేదీ కల్తీకి అనర్హం అనే రీతిలో కల్తీ చేస్తున్నట్లు హైదరాబాద్లోని పలుచోట్ల ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన తనిఖీల్లో వెల్లడైంది. వినియోగదారులు ఏ వస్తువు కొన్నా ఎక్సైరీ డేట్ కచ్చితంగా చెక్ చేశాకే తీసుకోవాలని పోలీసులు సూచించారు.
హైదరాబాద్ నగరంలో కల్తీల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ టాప్లో ఉంది. ఆ తర్వాత వంట మసాలాలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వందల కేజీల అల్లం పేస్ట్ బయటపడుతోంది. దీనిని సింథటిక్ఫుడ్కలర్స్తో తయారు చేస్తున్నట్టు తేల్చారు. వంద గ్రాముల డబ్బాల దగ్గర నుంచి.. అర కిలో, కిలో వరకు ప్యాక్ చేసి కిరాణా స్టోర్స్కు వీటిని సరఫరా చేస్తున్నారు. ఏదో ఒక బ్రాండింగ్ పేరు పెట్టి, వీటిని అమ్ముతున్నారు. ఎక్కువ మార్జిన్ ఇస్తుండడంతో కిరాణా షాప్ యజమానులు కూడా వీటినే సేల్ చేస్తున్నారు.
ALSO READ | మా ఊర్లో ఉంటూ.. మా భాష మాట్లాడవా : రెస్టారెంట్ యజమానిని చితక్కొట్టారు
తినే తిండే కాదు.. తాగే మంచినీళ్లు కూడా కల్తీ అవుతున్నాయి. బయటకు చెప్పేది బ్రాండ్ కంపెనీల పేర్లు.. లోపల నీళ్లు చూస్తే మాత్రం నాసిరకం. ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న తనిఖీల్లో ఈ విషయం పదేపదే బట్టబయలైంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, వంట మసాలాలు, హోటళ్లలో చెడిపోయిన ఫుడ్ ఐటమ్స్ అయితే కుప్పలుతెప్పలుగా బయటపడుతున్నాయి. మసాలాలు, వంట నూనెలు, టీ పొడి, కారం, పాల పదార్థాలు ఎక్కువగా కల్తీ చేస్తున్నారు.