జెహ్ ఏరోస్పేస్ రెండో యూనిట్ షురూ.. పుణేలో జీఈ ఏరోస్పేస్ కేంద్రం విస్తరణ

జెహ్ ఏరోస్పేస్ రెండో యూనిట్ షురూ.. పుణేలో జీఈ ఏరోస్పేస్ కేంద్రం విస్తరణ

హైదరాబాద్​, వెలుగు: ఏరోస్పేస్​  డిఫెన్స్​ మానుఫ్యాక్చరింగ్​ స్టార్టప్​ జెహ్​ ఏరోస్పేస్​ తన రెండో తయారీ యూనిట్‌‌ను తెలంగాణలో ప్రారంభించింది. దీని కోసం రాబోయే 6-12 నెలల్లో 50 మిలియన్​ డాలర్లు (సుమారు రూ. 445 కోట్లు) పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. జనరల్​ కాటలిస్ట్, ఎలివేషన్​ క్యాపిటల్, ఇండిగో వెంచర్స్​ వంటి పెట్టుబడిదారుల మద్దతు ఉన్న ఈ స్టార్టప్, 18 నెలల్లోనే 150 మిలియన్​ డాలర్లకు పైగా ఆర్డర్ ​బుక్‌‌ను సంపాదించింది. 

హైదరాబాద్​ సమీపంలో ఉన్న హారిజోన్​  ఇండస్ట్రియల్​ పార్క్​లో రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మాక్​ 2 అనే పేరుతో కొత్త యూనిట్​ను ఏర్పాటు చేస్తోంది. ఇది ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి, అంతర్జాతీయ కస్టమర్ల కోసం సరఫరా గొలుసును బలోపేతం చేస్తుంది. ఈ కొత్త యూనిట్​ వచ్చే సంవత్సరం కార్యకలాపాలను ప్రారంభించనుందని జెహ్​ తెలిపింది.

పుణేలో జీఈ ఏరోస్పేస్ కేంద్రం విస్తరణ 
పుణేలోని తమ యూనిట్​ విస్తరణకు రూ.124 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు జీఈ  ఏరోస్పేస్​ ప్రకటించింది. ఈ తయారీ కేంద్రం విజయవంతంగా దశాబ్దం పూర్తి చేసుకుందని తెలిపింది. తాజా పెట్టుబడి గత సంవత్సరం ప్రకటించిన 30 మిలియన్​ డాలర్ల పెట్టుబడిలో ఒక భాగం.

ఈ నిధులతో అధునాతన ఇంజిన్​ భాగాలకు మద్దతు ఇచ్చేలా తయారీ ప్రక్రియలను, ఆటోమేషన్​ను అప్‌‌గ్రేడ్​ చేస్తారు. ఈ కేంద్రం ప్రస్తుతం 300కు పైగా సరఫరాదారుల నెట్‌‌వర్క్‌‌తో అనుసంధానమై ఉంది. గత 10 సంవత్సరాలలో ఐదు వేలకు పైగా ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి, స్థానిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించింది.