వెలుగు, బిజినెస్ డెస్క్: కరోనా తర్వాత ట్రెండ్ మారిపోయింది. దేశంలో ఫిల్మ్ థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయింది. కరోనాకు మునుపటితో పోలిస్తే థియేటర్స్కు వెళ్లే వారి సంఖ్య గతేడాది 2.4 కోట్లు డౌన్ అయింది. 2020 జనవరి- -మార్చి మధ్యకాలంలో 14.6 కోట్ల మంది థియేటర్స్కు వెళ్లగా, గతేడాది 12.2 కోట్ల మందే వెళ్లారని మీడియా కన్సల్టింగ్ సంస్థ ‘ఒర్మాక్స్’ స్టడీలో వెల్లడైంది. ఓటీటీలకు జనం అలవాటుపడినందు వల్లే ఈవిధంగా ట్రెండ్ మారిందని సినీరంగ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ స్టడీలో భాగంగా దేశంలోని అర్బన్, రూరల్ ప్రాంతాలకు చెందిన 15 వేల మంది సినిమా ప్రేక్షకులను సర్వే చేశారు. వారు ఇచ్చిన వివరాలతో ‘సైజింగ్ ది సినిమా 2023’ పేరిట స్టడీ రిపోర్టును రూపొందించారు. థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల్లో పురుషులు, స్త్రీలు ఎంతమంది ? వారి వయసులు ఎంత ? ఏయే ప్రాంతాల వారు ? ఏయే భాషల సినిమాలు చూస్తారు ? వంటి సమగ్ర వివరాలను సేకరించి ఈ రిపోర్టులో పొందుపరిచారు.
2023పైనే మూవీ ఇండస్ట్రీ ఆశలు
ఇండియాలోని థియేటర్ ఇండస్ట్రీ పెద్దదని, దీనికి క్వాలిటీ డేటా అవసరమని ఒర్మాక్స్ మీడియా పార్ట్నర్ గౌతమ్ జైన్ చెప్పారు. ఇప్పటిదాకా సాధారణమైన డేటా మాత్రమే అందుబాటులో ఉంటోందని పేర్కొన్నారు. వివిధ లాంగ్వేజెస్ ఉన్న మన దేశంలో క్వాలిటీ డేటా అందుబాటులో లేకపోవడం లోపమే అవుతుందన్నారు. మూవీ ఇండస్ట్రీలోని ఇన్వెస్టర్లు, స్టూడియోలు, ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, మార్కెటర్లు, ఎగ్జిబిటర్లకు క్వాలిటీ డేటా ఎంతో సాయపడుతుందని జైన్ వివరించారు. ఈనేపథ్యంలో 2023 సంవత్సరంపై మూవీ ఇండస్ట్రీ గంపెడు ఆశలు పెట్టుకుందని ఆయన పేర్కొన్నారు.
తెలుగు ప్రేక్షకులు 3.04 కోట్ల నుంచి 2.8 కోట్లకు డౌన్
2022 సంవత్సరంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి ‘ఆర్ఆర్ఆర్’ మూవీ మంచి సక్సెస్ను ఇచ్చింది. అయినా గతేడాది తెలుగు సినిమా ఇండస్ట్రీ 7.8 శాతం మంది ప్రేక్షకులను పోగొట్టుకుంది. అంతకుముందు 3.04 కోట్ల మంది తెలుగు ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూసేవారు. 2022లో ఈ సంఖ్య 2.8 కోట్లకు పడిపోయింది. దేశంలో ఎక్కువ మంది మూవీ లవర్స్ హిందీ లాంగ్వేజ్ సినిమాలనే చూస్తున్నారు. కరోనాకు ముందు 5.8 కోట్ల మంది ప్రేక్షకులు హిందీ సినిమాలకు వెళ్లేవారని..ఇప్పుడు వారి సంఖ్య 21.5 శాతం తగ్గిపోయిందని ఒర్మాక్స్ వెల్లడించింది.
తమిళ సినిమా ప్రేక్షకుల సంఖ్యలో పెద్దగా మార్పు జరగలేదు. ఇది 2.82 కోట్ల వద్ద నిలకడగా ఉందని స్టడీలో వెల్లడైంది. ఇక ఇదే సమయంలో మన దేశంలో హాలీవుడ్మూవీస్ కు క్రేజ్ బాగా పెరిగింది. హాలీవుడ్ సినిమాలను థియేటర్లలో చూసే వారి సంఖ్య 10.1 శాతం పెరిగి 2.42 కోట్లకు చేరింది. దక్షిణాది లాంగ్వేజెస్ మూవీస్సైతం నిలకడగా గ్రోత్ సాధించాయి. ప్రత్యేకించి కన్నడ సినిమాలైతే ప్రేక్షకులను 25 శాతం పెంచుకోగలిగాయి. కన్నడ మూవీస్ చూసేందుకు థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య 1.16 కోట్ల నుంచి 1.45 కోట్లకు పెరిగిందని ‘ఒర్మాక్స్’ పేర్కొంది.