కామారెడ్డి కారులో అయోమయం

కామారెడ్డి కారులో అయోమయం
  • అసెంబ్లీ ఫలితాలపై ఇప్పటి వరకు నో రివ్యూ 
  • నియోజకవర్గ ఇన్​చార్జినీ నియమించలే
  • పార్టీ వీడుతున్న లీడర్లు, క్యాడర్​

కామారెడ్డి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో కేసీఆర్​ ఓటమి తర్వాత బీఆర్ఎస్​ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. పార్టీకి మంచి పట్టు ఉన్న సెగ్మెంట్​లోనే అధినేత ఓడిపోవడం గులాబీ వర్గాలను విస్మయానికి గురి చేసింది. ఫలితాల తర్వాత పార్టీ ముఖ్య నేతలు ఇక్కడి శ్రేణులను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఓటమిపై ఇప్పటివరకు నియోజకవర్గస్థాయి మీటింగ్​ నిర్వహించలేదు. కనీసం ఫలితాలపై రివ్యూ చేయలేదు. దీనికి తోడు పార్టీకి నియోజకవర్గ ఇన్​చార్జి ఎవరో తెలియక శ్రేణుల్లో సందిగ్ధత నెలకొంది. గులాబీ పార్టీకి కంచుకోటగా ఉన్న కామారెడ్డిలో ఇప్పుడు గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య లీడర్లు కారు దిగుతున్నారు. దీంతో క్యాడర్​లో అయోమయం నెలకొంది. 

ఇన్​చార్జి​ ఎవరు?

పార్టీ నియోజక వర్గ ఇన్​చార్జి బాధ్యతలను ఇంతవరకు ఎవరికీ అప్పగించలేదు. ఎన్నికల ముందు ఎమ్మెల్యేగా ఉన్న గంప  గోవర్ధన్​ అన్నీ తానై వ్యవహరించారు. ఎన్నికల టైమ్​లో ఆ బాధ్యతలను కేటీఆర్ తీసుకున్నారు. ఫలితాల తర్వాత ఇన్​చార్జి ఎవరనే విషయంలో స్పష్టత లేదు. అధినేత ఓటమితో ముఖ్య నేతలంతా క్యాడర్​తో అంటీముట్టన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందే ఇక్కడి శ్రేణులతో కేసీఆర్​ ప్రత్యేకంగా సమావేశమవుతారని చెప్పినప్పటికీ, ఫలితాల తర్వాత కూడా సమావేశం జరగలేదు. కొద్ది రోజుల కింద హైదరాబాద్​లో జహీరాబాద్ పార్లమెంట్​పై రివ్యూ చేశారు. కానీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంపై మాత్రం ఎలాంటి రివ్యూ జరగలేదు. పలువురు పార్టీని వీడుతున్నప్పటికీ దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తొమ్మిది నుంచి రెండుకు  

బీఆర్​ఎస్​ ఆవిర్భావం నుంచి వెన్నంటి నిలిచిన కామారెడ్డి నియోజకవర్గంలోనే ఆ పార్టీ అధినేత ఓడిపోవడం ముఖ్యనేతలకు మింగుడు పడడం లేదు.  అసెంబ్లీ ఎన్నికల్లో  కేసీఆర్​ కామారెడ్డిలో పోటీ చేయడం ద్వారా  ఉమ్మడి జిల్లాపై ప్రభావం చూపుతుందని అంచనా వేశారు.ఉమ్మడి జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉండగా, అంతకు మందు ఈ తొమ్మిది స్థానాల్లోనూ బీఆర్​ఎస్​ అభ్యర్థులే గెలిచారు. 

తాజా ఎన్నికల్లో 7 సిట్టింగ్​ స్థానాలను కోల్పోయిన బీఆర్​ఎస్​, 2 చోట్ల విజయంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సిట్టింగ్​ ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ ను కాదని కేసీఆర్​ గజ్వేల్​తో పాటు కామారెడ్డిలో ​ పోటీ చేశారు. పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ నియోజకవర్గ బాధ్యతలు చూశారు. స్థానికంగా విస్తృతంగా పర్యటించి, క్షేత్రస్థాయిలో ప్రచార బాధ్యతల కోసం ముఖ్య లీడర్లతో కోఆర్డినేషన్​ కమిటీ వేశారు. రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలంతా నియోజకవర్గంలోనే ఉండి హడావుడి చేశారు. ఫలితాల్లో కేసీఆర్​కు 59,911 ఓట్లు రాగా, బీజేపీ విజయం సాధించింది. ఫలితాలు ప్రతికూలంగా రావడంతో బీఆర్​ఎస్​ కోటకు బీటలు వారాయి. మండల, గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు, పార్టీ లీడర్లు, కౌన్సిలర్లు చాలా మంది బీఆర్​ఎస్​ను వీడారు. జహీరాబాద్​ ఎంపీ బీబీ పాటిల్​ కూడా ఇటీవల బీజేపీలో చేరారు.