- తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ సంకేతాలు
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 8–9 తేదీల్లో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా, దుబాయ్ స్పోర్ట్స్ సిటీ, జీఎంఆర్ స్పోర్ట్స్ మధ్య భారీ స్పోర్ట్స్ సిటీ ప్రాజెక్ట్ కోసం ముఖ్యమైన ఒప్పందం కుదరవచ్చని తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ వెల్లడించారు. 2036 ఒలింపిక్ క్రీడల్లో భారత్ పాల్గొనే ప్రతి విభాగంలో తెలంగాణ అథ్లెట్లు ఉండేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు.
టీ–హబ్లో శనివారం జరిగిన స్పోర్ట్స్ టెక్ పోడియం 2025లో ఆయన స్ప్రింట్ ఎక్స్ అనే స్పోర్ట్స్ యాక్సిలేటర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్ వంటి రంగాలలో బలమైన ఎకోసిస్టమ్ ఉన్నందున హైదరాబాద్ ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ ఇన్వెస్ట్మెంట్స్ను ఆకర్షించగలుగుతుందని పేర్కొన్నారు.
