
హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళలు నడుపుతున్న స్టార్టప్లకు సాయం చేసేందుకు ట్రూకాలర్, వీ హబ్ ఎంఓయూ కుదుర్చుకున్నాయి. డిజిటల్ సెక్టార్లో మహిళల పాత్రను పెంచడానికి ఇరు సంస్థల మధ్య కుదిరిన ఈ పార్టనర్షిప్ సాయపడుతుందని వీ–హబ్ పేర్కొంది. రాష్ట్ర ఐటీ, ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ సమక్షంలో ఈ ఎంఓయూ పైన వీ హబ్ సీఈఓ దీప్తీ రావుల, ట్రూకాలర్ డైరెక్టర్ (పబ్లిక్ అఫైర్స్) ప్రగ్యా మిశ్రా సంతకాలు చేశారు. దీంతో రాష్ట్రంలోని మహిళా స్టార్టప్ డెవలపర్లు ట్రూకాలర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ (ఎస్డీకే) ని వాడుకొని మొబైల్ వెరిఫికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేసుకోవడానికి వీలుంటుంది. అంతేకాకుండా 25 వేల డాలర్ల విలువైన అడ్వర్టయిజ్మెంట్ క్రెడిట్స్ను స్టార్టప్లకు ట్రూకాలర్ అందిస్తుంది. త్వరలో హ్యాకథాన్లను నిర్వహిస్తామని వీ–హబ్ పేర్కొంది.